మరో రెండు రోజులు వర్షాలు!

మండు వేసవిలో ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర ప్రజలకు వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

Published : 09 May 2024 03:43 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: మండు వేసవిలో ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర ప్రజలకు వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడతాయని సూచించింది. గురువారం పార్వతీపురం జిల్లాలో 5, శ్రీకాకుళం 4, విజయనగరంలో 3 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.

39 ప్రాంతాల్లో భారీ వర్షాలు

బుధవారం అనకాపల్లి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, విశాఖపట్నం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా అనంతపురం జిల్లా పామిడిలో 41.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లా జి.సింగవరంలో 39.7, విజయనగరం జిల్లా తుమికాపల్లిలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 39 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడులో 130.6 మిల్లీమీటర్లు, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 114.2 మి.మీ., కడియంలో 114, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటలో 110, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 102, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 98.4, వైఎస్సార్‌ జిల్లా రాజుపాలెంలో 95.8 మి.మీ. వర్షపాతం నమోదైందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు