Apple: భారత్‌లో కొత్తగా మరో మూడు యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌లు.. ఎక్కడంటే?

భారత్‌లో యాపిల్‌ (Apple) ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలోనే కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడేళ్లలో భారత్‌లో మరో మూడు కొత్త ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్లను (Apple Retail Stores) ప్రారంభించాలని నిర్ణయించింది.

Published : 03 Jun 2023 02:01 IST

దిల్లీ: యాపిల్ (Apple) కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌లో రెండు రిటైల్‌ స్టోర్లను (Apple Retail Stores) ప్రారంభించిన సంగతి తెలిసిందే. దిల్లీ (Delhi), ముంబయి(Apple)లో సందడిగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ (Tim Cook) స్వయంగా హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే యాపిల్ కంపెనీ భారత్‌లో తన ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్‌ల పరిధిని విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా మరో మూడు యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌లను భారత్‌లో ప్రారంభించనుంది. మొత్తంగా ఆసియా-ఫసిపిక్‌ ప్రాంతంలో భారత్‌, చైనా సహా ఇతర దేశాల్లో కొత్తగా 15 స్టోర్లను యాపిల్ ప్రారంభించనుంది. 

యాపిల్‌ కంపెనీ ఈ మూడు కొత్త స్టోర్లను కూడా దిల్లీ, ముంబయిలోనే ఏర్పాటు చేయనుందట. ప్రస్తుతం ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని రిలయన్స్‌ జియో వరల్డ్‌ డ్రైవ్‌లో యాపిల్‌ బీకేసీ ( Apple BKC) పేరిట మొదటి రిటైల్‌ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. రెండో స్టోర్‌ను దిల్లీలోని సెలెక్ట్‌ సిటీవాక్‌ మాల్‌లో యాపిల్‌ సాకేత్‌ ( Apple Saket) పేరుతో ప్రారంభించింది. 2025 నాటికి మూడో యాపిల్‌ స్టోర్‌ను ముంబయి సబర్బన్‌లోని బోరివాలి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని యాపిల్‌ భావిస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు యాపిల్‌ ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. 

యాపిల్ నాలుగో స్టోర్‌ను దిల్లీలోని డీఎల్‌ఎఫ్‌ ప్రోమెనేడ్‌ మాల్‌లో 2026 నాటికి ప్రారంభించాలనుకుంటోంది. ముంబయిలోని యాపిల్ బీకేసీ తర్వాత ఇదే రెండో పెద్ద యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఐదో స్టోర్‌ను 2027 నాటికి ముంబయిలోని వ్రోలి ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. అమెరికా, యూరప్‌ తర్వాత ఆసియా ప్రాంతంలో యాపిల్ రిటైల్ మార్కెట్‌ను విస్తరించాలనే లక్ష్యంతో కంపెనీ వీటిని ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా యాపిల్ ఉత్పత్తులకు భారత్‌లో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని