IAS, IPSల పెట్టుబడులపై కేంద్రం కీలక ఆదేశాలు

All India Services: ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లలో ఉన్నవారందరూ  స్టాక్స్‌, షేర్లు, ఇతర పెట్టుబడి సాధనాల్లో చేసే లావాదేవీల విలువ ఆరు నెలల మూల వేతనం కంటే అధికంగా ఉంటే ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది.

Updated : 30 Mar 2023 14:06 IST

దిల్లీ: ‘అఖిల భారత సర్వీస్‌ (All India Services)’లలో ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక కేలండర్‌ ఏడాదిలో స్టాక్స్‌, షేర్లు, ఇతర పెట్టుబడి సాధనాల్లో చేసే లావాదేవీల విలువ ఆరు నెలల మూల వేతనం కంటే అధికంగా ఉంటే ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

అఖిల భారత సర్వీసు నిబంధనలు (1968)లోని రూల్‌ 16(4) ప్రకారం ఏటా వెల్లడించే వివరాలకు తాజాగా సమర్పించాల్సిన సమాచారం అదనమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లలో ఉన్నవారందరికీ వర్తిస్తాయని తెలిపింది. రూల్‌ 14(1) ప్రకారం.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్న ఏ వ్యక్తీ స్టాక్‌, షేర్‌, ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలపై ఊహాజనిత పెట్టుబడులు పెట్టడం సరికాదని గుర్తుచేసింది. తరచూ స్టాక్స్‌, షేర్లు, ఇతర సెక్యూరిటీల్లో క్రయవిక్రయాలు ఊహాజనిత మదుపుగానే భావించాల్సి ఉంటుందని తెలిపింది.

మరోవైపు షేర్లు, సెక్యూరిటీలు, డిబెంచర్లు వంటివి చరాస్తుల కిందకు వస్తాయని గుర్తుచేసింది. వీటిలో వ్యక్తిగత లావాదేవీల విలువ రెండు నెలల మూలవేతనం కంటే అధికంగా ఉంటే ఆ వివరాలను సైతం రూల్‌ 16(4) ప్రకారం.. సంబంధిత అధికారులకు తెలియజేయాలని తెలిపింది. లావాదేవీ పూర్తయిన నెల రోజుల వ్యవధిలో సమాచారం అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది. దీనికి తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్న ఆదేశాలు అదనమని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని