2030కి 6 విద్యుత్‌ వాహనాలు

జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ 2030 ఆర్థిక సంవత్సరానికల్లా, భారత్‌లో 6 బ్యాటరీ విద్యుత్‌ వాహనాలను విడుదల చేస్తామని గురువారం వెల్లడించింది.

Published : 27 Jan 2023 05:41 IST

సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌

దిల్లీ: జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ 2030 ఆర్థిక సంవత్సరానికల్లా, భారత్‌లో 6 బ్యాటరీ విద్యుత్‌ వాహనాలను విడుదల చేస్తామని గురువారం వెల్లడించింది. కంపెనీ వృద్ధి వ్యూహంలో భాగంగా, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 2070 నాటికి కర్బన రహిత స్థితికి చేరాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి వృద్ధి వ్యూహాన్ని తమ భారతీయ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా ద్వారా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సుజుకీ మోటార్‌ తెలియజేసింది. బ్యాటరీ విద్యుత్‌ వాహనాలే కాకుండా సీఎన్‌జీతో నడిచే కర్బన రహిత ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌ వాహనాలను, బయోగ్యాస్‌, ఇథనాల్‌ మిశ్రమ ఇంధన వినియోగంతో నడిచే వాహనాలను కూడా దేశీయ విపణిలో విడుదల చేస్తామని వెల్లడించింది. ఆటో ఎక్స్‌పో 2023లో ప్రకటించిన విద్యుత్తు ఎస్‌యూవీ ని 2024 ఆర్థిక సంవత్సరంలో విపణిలోకి తీసుకువస్తామని తెలిపింది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం 6 బ్యాటరీ ఈవీలు అందుబాటులోకి వస్తాయని, అప్పటికి తమ వాహనాల్లో విద్యుత్తు విభాగ వాటా 15 శాతానికి, హైబ్రిడ్‌ విద్యుత్తు వాహనాల వాటా 25 శాతానికి  చేరుతుందని వివరించింది.

బయోగ్యాస్‌పైనా ఆసక్తి: పశువుల పేడ నుపయోగించి ఉత్పత్తి చేసే బయోగ్యాస్‌ను కూడా సీఎన్‌జీ వాహనాల్లో ఇంధనంగా వాడొచ్చని, ఈ వ్యాపారంపైనా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. ఇది సాకారమైతే, గ్రామీణ ప్రాంత రైతులకూ మేలు కలుగుతుందని వివరించింది.


పెండింగ్‌ ఆర్డర్లు 4.05 లక్షలు: మారుతీ

దిల్లీ: స్థిరంగా ఆర్డర్లు వస్తుండటంతో, తాము డెలివరీ చేయాల్సిన (పెండింగ్‌లో ఉన్న) వాహనాల సంఖ్య  4.05 లక్షలకు పెరిగినట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి (మార్కెటింగ్‌, విక్రయాలు) శశాంక్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇటీవల విడుదల చేసిన స్పోర్ట్స్‌ వినియోగ వాహనాలైన (ఎస్‌యూవీలు) జిమ్నీకి 11,000, ఫ్రోంక్స్‌కు 4,000 బుకింగ్‌లు వచ్చినట్లు వివరించారు. 2022 డిసెంబరు ఆఖరుకు కంపెనీ వద్ద 3.63 లక్షల వాహనాల పెండింగ్‌ ఆర్డర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈనెలలో ఇప్పటికే మరింత పెరిగాయి. 2022లో మారుతీ మొత్తం 15.76 లక్షల వాహనాలను విక్రయించింది. 2021లో అమ్మిన 13.64 లక్షల వాహనాలతో పోలిస్తే ఇవి 16 శాతం అధికం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని