PhonePe lite: ఫోన్‌పేలో యూపీఐ లైట్‌ ఫీచర్‌.. ఎలా వాడాలంటే?

PhonePe: చిన్న మొత్తాల్లో డిజిటల్‌ చెల్లింపులను సులభతరం చేయటం కోసం ఫోన్‌పే యూపీఐ లైట్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

Updated : 06 May 2023 11:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూపీఐ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చిన్న మొత్తాలకూ యూపీఐని వినియోగించడం ఇప్పుడు సర్వ సాధారణమైంది. ఏ చిన్న వస్తువు కొన్నా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి బ్యాంకు ఖాతాలోని డబ్బులు చెల్లించొచ్చు. ఇందుకోసం యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పిన్‌ ఎంటర్‌ చేసే పని కూడా లేకుండా మరింత సులభంగా చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (NPCI) యూపీఐ లైట్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లోనే దీనిని ప్రవేశపెట్టింది. ఇప్పటికే పేటీఎం ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. తాజాగా ఫోన్‌పే కూడా అదే జాబితాలో చేరింది.

యూపీఐ లైట్‌ అంటే?

చిన్నమొత్తాల డిజిటల్ చెల్లింపుల కోసం తీసుకొచ్చిన ఫీచర్‌ ఈ యూపీఐ లైట్‌ (UPI Lite). సాధారణంగా పేమెంట్ చేయాలంటే యూపీఐ పిన్ తప్పనిసరి. ఈ ఫీచర్‌ యాక్టివేట్ చేసుకుంటే సింగిల్ క్లిక్‌తో పిన్‌ ఎంటర్ చేసే పనిలేకుండా చెల్లింపుల చేయొచ్చు. ఇందుకోసం వ్యాలెట్‌లో కొంత మొత్తం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకేసారి గరిష్ఠంగా రూ.2 వేల వరకు అమౌంట్‌ యాడ్‌ చేసుకోవచ్చు. ఒకసారి రూ.200 వరకూ లావాదేవీని సింగిల్‌ క్లిక్‌తో పూర్తి చేయొచ్చు. ఒకవేళ బ్యాంక్‌ సేవల్లో అంతరాయం ఉన్నా పేమెంట్‌ చేయడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పైగా సత్వరమే లావాదేవీ పూర్తి చేయొచ్చు. ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలో చూద్దాం..

  •  ఈ ఫీచర్‌ పొందాలంటే ముందుగా ఫోన్‌పే యాప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను వాడుతుండాలి.
  •  ఫోన్‌పే యాప్‌ తెరిచాక హోమ్‌ స్క్రీన్‌పై మీకు ‘UPI Lite’ ఆప్షన్‌ దర్శనమిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి.
  •  మీరు యూపీఐ లైట్‌ ఖాతాలో జమ చేయదలచుకున్న మొత్తాన్ని ఎంటర్ చేసి బ్యాంక్‌ అకౌంట్‌ను ఎంచుకోండి.
  •  యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేయగానే మీ ‘UPI Lite’ అకౌంట్‌ యాక్టివేట్‌ అవుతుంది.
  •  ఆపై ఏ క్యూర్‌ కోడ్‌నైనా స్కాన్‌ చేసి పేమెంట్‌ను పూర్తి చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని