Vivo Phones: వివోకు షాక్‌.. 27వేల ఫోన్ల ఎగుమతులకు కేంద్రం బ్రేక్‌

చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ వివోకు (Vivo) మరోసారి షాక్‌ తగిలింది. భారత్‌లో తయారు చేసి పొరుగు దేశాలకు చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులను కేంద్రం అడ్డుకుంది.

Published : 07 Dec 2022 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ వివోకు (Vivo) మరోసారి షాక్‌ తగిలింది. భారత్‌లో తయారు చేసి పొరుగు దేశాలకు చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులను కేంద్రం అడ్డుకుంది. సుమారు 27 వేల ఫోన్లను దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆర్థిక శాఖకు చెందిన రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ యూనిట్‌ వారం రోజులుగా నిలిపివేసింది. స్మార్ట్‌ఫోన్ మోడల్‌, వాటి విలువను తప్పుగా చూపుతూ వీటిని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ అధికారులు అడ్డుకున్నారు. వీటి విలువ సుమారు రూ.120 కోట్లుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిపై అటు వివో ఇండియా గానీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ స్పందించలేదు. అయితే, ప్రభుత్వ ఏజెన్సీ చర్య ఏకపక్షంగా ఉందని భారత సెల్యూలర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ తప్పుబట్టింది.

2020లో జరిగి గల్వాన్‌ ఘటన అనంతరం చైనా కంపెనీలపై భారత్‌ దృష్టి పెట్టింది. షావోమి, జడ్‌టీఈ, ఎంజీ మోటార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలపై ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌(పీఎమ్‌ఎల్‌ఏ) కింద జులై 5న వివో, సంబంధిత కంపెనీల ఈడీ సోదాలు నిర్వహించి దర్యాప్తు చేపట్టింది. భారత్‌లో పన్నులను తప్పించుకోవడం కోసం చైనాకు చట్టవ్యతిరేకంగా రూ.62,476 కోట్లను వివో బదిలీ చేసినట్లు ఈడీ జులై 7న ఆరోపించింది. వివో టర్నోవరులో ఇది దాదాపు సగం కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని