Energy sector: భారత ఇంధన రంగంలోకి 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: మోదీ

Energy sector: భారత ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

Published : 06 Feb 2024 15:12 IST

గోవా: వచ్చే 5-6 ఏళ్లలో భారత ఇంధన రంగంలోకి (Energy sector) 67 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) తెలిపారు. భారత ఇంధనరంగ వృద్ధిలో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించినట్లు చెప్పారు. భారత ఇంధన వారోత్సవాలను (India Energy Week) మంగళవారం ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత ఆర్థికవ్యవస్థ 7.5 శాతం వార్షిక వృద్ధి రేటుతో దూసుకెళ్తోందని మోదీ (Modi) అన్నారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో ఇంధన రంగంలో (Energy sector) భారత్‌ పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. 2045 నాటికి దేశ ఇంధన అవసరాలు రెట్టింపవుతాయన్నారు. ప్రపంచంలో భారత్‌ మూడో అతిపెద్ద ముడిచమురు, ఎల్‌పీజీ వినియోగదారు అని గుర్తుచేశారు. అలాగే ఎల్‌ఎన్‌జీ వినియోగంలో నాలుగో స్థానంలో ఉందని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ.. భారత్‌ మాత్రం దాన్ని సమర్థంగా ఎదుర్కోగలిగిందని మోదీ అన్నారు. పైగా గత రెండేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని తగ్గించినట్లు గుర్తు చేశారు.  ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల దేశీయ సహజవాయువు ఉత్పత్తి పెరుగుతోందన్నారు. భారత ఇంధన వినియోగంలో గ్యాస్‌ వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచుతామన్నారు. గత పదేళ్లలో పెట్రోల్‌లో ఇథేనాల్‌ వాటాను 1.5 నుంచి 12 శాతానికి పెంచామన్నారు. 2025 నాటికి దాన్ని 20 శాతానికి చేర్చుతామని తెలిపారు.

ప్రపంచ ఉద్గారాల్లో భారత్‌ వాటా నాలుగు శాతమేనని గుర్తుచేశారు. 2070 నాటికి శూన్య ఉద్గారాల స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు గుర్తు చేశారు. ఇటీవల ప్రకటించిన సూర్యోదయ యోజనలో భాగంగా ఇళ్లల్లో అదనంగా ఉత్పత్తయ్యే విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని