Taxi Services: ట్యాక్సీ సర్వీస్‌లకు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు.. కర్ణాటక ప్రభుత్వం ప్రకటన

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ట్యాక్సీ సర్వీస్‌లను అందించాలని కర్ణాటక సర్కారు ప్రకటించింది. 

Updated : 05 Feb 2024 15:13 IST

బెంగళూరు: ట్యాక్సీ సర్వీస్‌ (Taxi Services) ధరలకు సంబంధించి కర్ణాటక (Karnataka) సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా (OLA), ఉబర్‌ (Uber) వంటి యాప్‌ ఆధారిత సంస్థలతో పాటు, నాన్‌-యాప్‌ బేస్డ్‌ ట్యాక్సీ సర్వీస్‌లకు స్థిరమైన ఛార్జీలను అమలుచేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ‘ఫిక్స్‌డ్‌ ఫేర్‌ రూల్‌’ (Fixed Fare Rule) పేరుతో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలు వినియోగదారుల నుంచి ఇష్టానుసారంగా ధరలను వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది. తక్షణం ఈ ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. తాజా నిబంధనల ప్రకారం వాహనం ఖరీదు ఆధారంగా క్యాబ్‌ సర్వీస్‌లను మూడు భాగాలుగా విభజించింది.  

  • వాహనం ధర రూ.10 లక్షల కంటే తక్కువైతే.. మొదటి నాలుగు కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.100. తర్వాత ప్రతి అదనపు కి.మీ. రూ.24 చెల్లించాలి. 
  • కారు ఖరీదు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉంటే, కనీస ఛార్జీ రూ.115 కాగా, అదనపు కి.మీ రూ.28గా నిర్ణయించారు. 
  • వాహనం ధర రూ.15 లక్షలు దాటితే తొలి నాలుగు కి.మీ. కనీస ఛార్జీ రూ.130. తర్వాత ప్రతి కి.మీ. రూ.32 చెల్లించాలి.
  • క్యాబ్‌ బుక్‌ చేసిన తర్వాత మొదటి ఐదు నిమిషాల వెయిటింగ్‌ ఉచితం. తర్వాత ప్రతి నిమిషానికి ఒక రూపాయి ఛార్జీ వర్తిస్తుంది. 
  • యాప్‌ ఆధారిత ట్యాక్సీ సర్వీస్‌ను అందించే సంస్థలు ఐదు శాతం జీఎస్టీతోపాటు, టోల్‌ ఛార్జీలు వసూలుచేసేందుకు అనుమతించారు. 
  • రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య క్యాబ్‌ సర్వీస్‌లను అందించే సంస్థలు సాధారణ ధరలకు అదనంగా పది శాతం వసూలుచేసుకోవచ్చని తెలిపింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని