Mukesh Ambani: దుబాయిలో రూ.640కోట్లతో అంబానీల విల్లా.. చిన్న కుమారుడి కోసమేనట..!

భారత అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ విదేశాల్లో మరో లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారట. అరబ్‌ నగరం

Updated : 29 Aug 2022 13:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ విదేశాల్లో మరో లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారట. అరబ్‌ నగరం దుబాయిలోని సముద్ర తీరంలో 80 మిలియన్‌ డాలర్లతో (భారత కరెన్సీలో దాదాపు రూ.640కోట్లు) ఈ విల్లాను కొనుగోలు చేసినట్లు బ్లూమ్‌బర్గ్‌ కథనం వెల్లడించింది. దుబాయిలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ డీల్‌ అని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు చెప్పినట్లు ఈ కథనం పేర్కొంది.

దుబాయిలోని పామ్‌ జుమైరాలో ఉన్న ఈ విల్లాను ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్‌ కోసం ఈ ఏడాది ఆరంభంలోనే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రైవేటు డీల్‌ కావడంతో దీన్ని అత్యంత రహస్యంగా ఉంచినట్లు బ్లూమ్‌బర్గ్‌ కథనం పేర్కొంది. దుబాయి స్థానిక కథనాల్లోనూ అంబానీ పేరును వెల్లడించకుండా భారత బిలియనీర్‌ అని పేర్కొన్నారు. రిలయన్స్‌ ఆఫ్‌షోర్‌ సంస్థల్లో ఒకటి ఈ డీల్‌ను రహస్యంగా జరిపినట్లు తెలుస్తోంది. ఈ విల్లాను తమకనుగుణంగా మార్చుకోవడంతో పాటు, భద్రత కోసం అంబానీలు మరిన్ని కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.

చెట్టు ఆకారంలో ఉండే ఈ పామ్‌ జుమైరా.. దుబాయిలో కృతిమంగా ఏర్పాటుచేసిన దీవుల సముదాయం. ఈ ప్రాంతంలోనే ఓ బీచ్‌ సైడ్‌ లగ్జరీ విల్లాను అంబానీ కొనుగోలు చేశారట. ఇందులో 10 పడకగదులు, ప్రైవేట్‌ స్పా, ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉన్నాయి. ఈ విల్లాకు సమీపంలోనే బ్రిటిష్‌ ఫుట్‌బాలర్‌ డేవిడ్‌ బెక్‌హమ్‌, బాలీవుడ్‌ ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ నివాసాలు కూడా ఉన్నాయి.

కాగా.. గతేడాది ముకేశ్ అంబానీ బ్రిటన్‌లో ఓ విశాల సౌధాన్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. లండన్‌లో బకింగ్‌హాంషైర్‌ వద్ద ఉన్న 300 ఎకరాల్లోని ‘స్టోక్‌ పార్క్‌’ను రూ.592 కోట్లతో కొనుగోలు చేశారు. దీన్ని పెద్ద కుమారుడు ఆకాశ్ కోసం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా చిన్న కుమారుడు అనంత్‌ కోసం దుబాయిలో లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారు. ఇక కుమార్తె ఈశా అంబానీ కోసం న్యూయార్క్‌లో ఇల్లు వెతుకుతున్నట్లు సమాచారం. 65 ఏళ్ల ముకేశ్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని వారసులకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఆకాశ్‌ను రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ముకేశ్‌ అంబానీ కుటుంబం ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో నిర్మించిన ఆకాశహర్మ్యం ‘యాంటిలియా’లో నివాసముంటోంది. 27 అంతస్తుల ఈ భవనంలో మూడు హెలిపాడ్లు, 168 కార్ల కోసం పార్కింగ్‌, 50 మంది కూర్చుని చూసే సినిమా థియేటర్‌, 9 ఎలివేటర్లు ఇతర అధునాతన సదుపాయాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని