Petrol- diesel: గ్యాస్‌ తరహాలో పెట్రోల్‌, డీజిల్‌ నష్టాలకూ పరిహారం!

petrol, diesel losses: గత ఎనిమిది నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉంచడం వల్ల ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖను చమురు మంత్రిత్వ శాఖ కోరనుంది.

Published : 03 Dec 2022 00:24 IST

దిల్లీ: గత ఎనిమిది నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉంచడం వల్ల ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖను చమురు మంత్రిత్వ శాఖ (Oil ministry) కోరనుంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC), భారత్‌ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (HPCL) ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో రూ.21,201.18 కోట్ల నష్టాలను ప్రకటించాయి. ఎల్పీజీ సబ్సిడీ కింద కేంద్రం రూ.22వేల కోట్లు కేంద్రం గ్రాంటుగా ఇవ్వడంతో ఈ నష్టాలు కొంతమేర తగ్గాయయి. లేదంటే ఇంకా ఎక్కువగానే ఉండాల్సింది.

ఈ నేపథ్యంలో గ్యాస్‌ తరహాలో పెట్రోల్‌, డీజిల్‌ నష్టాలకు పరిహారం కోరాలని ఆయిల్‌ మంత్రిత్వ శాఖ భావిస్తోందని ఆ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉంచడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరిందని తెలిపారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మార్చుకునే స్వేచ్ఛ చమురు కంపెనీలకు ఉన్నప్పటికీ.. ధరల్లో ఎలాంటి మార్పూ చేయలేదని సదరు అధికారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖను చమురు మంత్రిత్వ శాఖ సంప్రదించనుందని తెలిపారు. అంతకంటే ముందే మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఎంత నష్టం వస్తుందనేది అంచనా వేయనున్నట్లు తెలిపారు.

అంతర్జాతీయంగా ధరలు గరిష్ఠ స్థాయికి చేరినా చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ఏప్రిల్‌ 6 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను స్థిరంగా ఉంచాయి. అయితే, ఎల్పీజీ నష్టాలకు గానూ కేంద్రం ఈ ఏడాది అక్టోబర్‌లో చమురు సంస్థలకు రూ.22 వేల కోట్లు గ్రాంటుగా అందించింది. రూ.28వేల కోట్లు చమురు మంత్రిత్వశాఖ కోరగా.. ఆర్థిక శాఖ రూ.22వేల కోట్లు మంజూరు చేసింది. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గించడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దిగి వస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఒకవేళ చమురు ధరలు తగ్గితే మే 22 తర్వాత తొలిసారి తగ్గించినట్లు అవుతుంది. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్‌ ధర రూ.96.72, డీజిల్‌ ధర రూ.89.62 ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని