Samsung: 60 రోజుల్లో ₹14,400 కోట్ల శాంసంగ్‌ ఫోన్ల అమ్మకాలు.. 5జీకి పెరుగుతున్న డిమాండ్‌!

సెప్టెంబర్‌- అక్టోబర్‌ నెలల్లో రూ.14,400 కోట్ల విలువైన ఫోన్లు అమ్ముడైనట్లు శాంసంగ్‌ తెలిపింది. 5జీ ఫోన్ల విక్రయాలు భారీ పెరిగినట్లు పేర్కొంది.

Published : 05 Nov 2022 14:44 IST

దిల్లీ: దేశంలో స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈ పండగ సీజన్‌లో వీటి అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్క సెప్టెంబర్‌- అక్టోబర్‌ నెలల్లోనే తాము రూ.14,400 కోట్ల విలువైన ఫోన్లు విక్రయించినట్లు శాంసంగ్‌ ఇండియా తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు (మొదటి మూడు త్రైమాసికాల్లో) రికార్డు స్థాయిలో 5జీ ఫోన్ల అమ్మకాలు జరిగాయని ఆ కంపెనీ సీనియర్‌ డైరెక్టర్‌ ఆదిత్య బబ్బర్‌ తెలిపారు. ప్రీమియం కేటగిరీలో 99 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించారు.

‘‘ఈ ఏడాది పండగ సీజన్‌లో శాంసంగ్‌ భారీ స్థాయిలో విక్రయాలు జరిపింది. కేవలం 60 రోజుల్లోనే రూ.14,400 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను విక్రయించింది’’ అని బబ్బర్‌ తెలిపారు. గతేడాది పండగ సీజన్‌తో పోలిస్తే రెండంకెల వృద్ధి నమోదైందని చెప్పారు. శాంసంగ్‌ ఫైనాన్స్‌ ప్లస్‌ అమ్మకాలు పెరిగేందుకు దోహదపడిందన్నారు. రూ.30వేలు కంటే ఎక్కువ విలువైన ప్రీమియం ఫోన్ల అమ్మకాలు గతేడాది కంటే 99 శాతం అధికంగా నమోదైనట్లు తెలిపారు. ఎస్‌22, ఫోల్డబుల్‌ ఫోన్స్‌ వంటి ఫోన్ల ద్వారా ప్రీమియం సెగ్మెంట్‌లో కంపెనీ వేగంగా వృద్ధి చెందుతోందన్నారు.

గతేడాది పోలిస్తే మొత్తంగా కంపెనీ వ్యాపారం 20 శాతం మేర వృద్ధి చెందిందని బబ్బర్‌ వెల్లడించారు. రెవెన్యూ పరంగా దేశంలో 22 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉన్నామని వివరించారు. వినియోగదారులు ఎక్కువ మంది 5జీ, ప్రీమియం ఫోన్లవైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. 5జీ సదుపాయం కలిగిన 20 ఫోన్లను తాము విక్రయిస్తున్నామని, వీటి ధరలు రూ.10,900 నుంచి ప్రారంభమవుతున్నాయని పేర్కొన్నారు. అన్ని 5జీ డివైజులకూ నవంబర్‌ 15 నాటికి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని, ఇప్పటికే కొన్ని డివైజులు 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేస్తున్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు