Stock Market: నష్టాల్లో మార్కెట్‌ సూచీలు.. 17,050 కిందకు నిఫ్టీ

Stock Market: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 154 పాయింట్ల నష్టంతో 57,770 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 55 పాయింట్లు నష్టపోయి 17,021 దగ్గర కొనసాగుతోంది. 

Published : 24 Mar 2023 09:45 IST

Stock Market Update | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమైన కాపేపటికే అమ్మకాల సెగతో నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 154 పాయింట్ల నష్టంతో 57,770 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 55 పాయింట్లు నష్టపోయి 17,021 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.28 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, మారుతీ, ఎల్‌అండ్‌టీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటన్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. డిపాజిటర్లు నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆ దేశ ఆర్థిక మంత్రి జానెట్‌ యెల్లెన్‌ పునరుద్ఘాటించారు. ఈ ప్రకటన అక్కడి సూచీల్లో ఉత్సాహం నింపింది. అయితే, పతనం అంచున ఉన్న బ్యాంకులను కాపాడేందుకు ఫెడరల్‌ ఎమర్జెన్సీ చర్యలు తీసుకోవడాన్ని పరిశీలిస్తామని ఆమె ప్రకటించడాన్ని ఆసియా- పసిఫిక్‌ సూచీలు ప్రతికూలంగా తీసుకున్నాయి. దీంతో సూచీలు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీరేట్లను మరో 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది.

గమనించాల్సిన స్టాక్స్‌..

హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌: అదనంగా మరో 1.75 శాతం వాటాలను విక్రయించాలని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ నిర్ణయించింది. ఆఫర్‌ సర్‌ సేల్‌లో కంపెనీ వాటాలు 4.5 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. శుక్రవారం రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇష్యూ ప్రారంభం కానుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌: ముంబయి మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో పిరమల్‌ రియాలిటీకి చెందిన అన్ని రెసిడెన్షియల్‌ ప్రాజెక్టుల్లో ఈవీ ఛార్జింగ్‌ వసతులు ఏర్పాటు చేసేందుకు పిరమల్‌ గ్రూప్‌తో జియో- బీపీ ఒప్పందం కుదుర్చుకొంది.

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌: రక్షణ శాఖ నుంచి భారత్‌ ఎలక్ట్రానిక్స్‌కు రూ.3,700 కోట్లు విలువ చేసే రెండు ప్రాజెక్టులు లభించాయి. మీడియం పవర్‌ రాడార్‌ ఆరుద్రతో పాటు 129 డీఆర్‌-118 రాడార్‌ వార్నింగ్‌ రీసీవర్స్‌ను భారత వాయుసేనకు భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ అందించనుంది.

టాటా స్టీల్‌: పరోక్ష అనుబంధ సంస్థ అయిన టాటా స్టీల్‌ అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌లో టాటా స్టీల్‌ డౌన్‌స్ట్రీమ్‌ ప్రొడక్ట్స్‌కు ఉన్న మిగిలిన 1.35 కోట్ల షేర్లను టాటా స్టీల్‌ కొనుగోలు చేసింది.

వేదాంత: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐదో మధ్యంతర డివిడెండ్‌ను నిర్ణయించే నిమిత్తం మార్చి 28న వేదాంత బోర్డు సమావేశం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని