Digital identity: షాకింగ్‌.. 6 లక్షల మంది భారతీయుల డేటాను అమ్మేశారు!

ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది వ్యక్తుల డేటాను (Personal data) హ్యాకర్లు చోరీ చేసి బాట్‌ మార్కెట్లో విక్రయించినట్లు వెల్లడైంది. అందులో అత్యధికంగా భారత్‌ నుంచే 6 లక్షల మంది వివరాలు ఉన్నాయని తేలింది.

Published : 08 Dec 2022 19:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతికత ఏ స్థాయిలో వృద్ధి చెందుతోందో సైబర్‌మోసాలూ (Cyber crimes) అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి వెలుగుచూసింది. ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది వ్యక్తుల డేటాను (Personal data) హ్యాకర్లు చోరీ చేసి బాట్‌ మార్కెట్లో విక్రయించినట్లు వెల్లడైంది. అందులో అత్యధికంగా భారత్‌ నుంచే 6 లక్షల మంది వివరాలు ఉన్నాయని వీపీఎన్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ నార్డ్‌ వీపీఎన్‌ (Nord VPN) తన అధ్యయనంలో పేర్కొంది. 2018 నుంచి గత నాలుగేళ్లుగా బాట్‌ మార్కెట్‌లో విక్రయానికి ఉంచిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.

బాట్‌ మాల్‌వేర్‌ (Bot malware) సాయంతో వ్యక్తుల డివైజ్‌ల నుంచి సేకరించిన డేటాను హ్యాకర్లు బాట్‌ మార్కెట్‌లో విక్రయిస్తుంటారని నార్డ్‌ వీపీఎన్‌ తెలిపింది. ఇందులో యూజర్‌ లాగిన్‌ వివరాలు, కుకీస్‌, డిజిటల్‌ ఫింగర్‌ ప్రింట్స్‌, స్క్రీన్‌షాట్స్‌, ఇతర వివరాలు ఉంటాయని పేర్కొంది. ఒక్కో వ్యక్తి డిజిటల్‌ గుర్తింపును విక్రయించినందుకు గానూ సగటున రూ.490 చెల్లిస్తుంటారని తెలిపింది. 2018 నుంచి ఈ బాట్‌ మార్కెట్‌ అందుబాటులోకి రాగా.. జెనిసిస్ మార్కెట్‌, ది రష్యన్‌ మార్కెట్‌, 2 ఈజీ అనే మూడు ప్రధాన మార్కెట్లను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది. అయితే, ఇందులో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌కు సంబంధించిన లాగిన్‌ వివరాలు సైతం ఉన్నాయని పేర్కొంది.

ఈ సందర్భంగా డార్క్‌ వెబ్‌కీ, బాట్‌ మార్కెట్‌కూ మధ్య తేడాను సైతం నార్డ్‌ వివరించింది. బాట్‌ మార్కెట్‌ కావాలనుకుంటే.. ఒక ప్రదేశంలో ఒక వ్యక్తికి సంబంధించిన డేటాను అధికమొత్తంలో పొందగలదని తెలిపింది. అంతేకాదు.. బాట్‌ మాల్వేర్‌ ద్వారా ఇన్‌ఫెక్ట్‌ అయినంత కాలం సంబంధిత డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తామన్న హామీ కొనుగోలుదారులకు ఉంటుందని నార్డ్‌ వీపీఎన్‌ పేర్కొంది. ఇప్పటి వరకు విక్రయించిన డేటాలో 81 వేల డిజిటల్‌ ఫింగర్‌ ప్రింట్‌లు, 5.38 లక్షల ఆటో ఫిల్‌ఫార్మ్స్‌తో పాటు అనేక డివైజుల స్క్రీన్‌ షాట్‌లు, వెబ్‌కామ్‌ స్నాప్స్‌ ఉన్నాయని నార్డ్‌ వీపీఎన్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని