TCS on layoffs: టీసీఎస్‌లో ఉద్యోగుల తీసివేతలుండవ్‌

TCS on layoffs: టీసీఎస్‌లో ఉద్యోగుల తొలగింపులు ఉండబోవని కంపెనీ చీఫ్‌ హెచ్‌ఆర్‌ తెలిపారు. పైగా అంకుర సంస్థల్లో ఉద్వాసనకు గురైన వారిని తమ కంపెనీల్లో నియమించుకుంటామని పేర్కొన్నారు.

Updated : 19 Feb 2023 20:07 IST

ముంబయి: టెక్‌ కంపెనీలన్నీ ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో పడ్డాయి. అందులో భాగంగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి (Layoffs). అయితే, టీసీఎస్‌ (TCS) మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగుల్ని ఎట్టిపరిస్థితుల్లో తొలగించే ఆలోచన లేదని చీఫ్‌ హ్యూమన్‌ రీసోర్సెస్‌ ఆఫీసర్‌ మిలింద్‌ లక్కడ్‌ తెలిపారు. ఉద్యోగుల్ని నియమించుకునేటప్పుడే వారు సుదీర్ఘకాలం పాటు కంపెనీలోనే పనిచేసేలా టీసీఎస్‌ (TCS) శిక్షణనిస్తుందని పేర్కొన్నారు.

చాలా కంపెనీలు అవసరానికి మించి ఉద్యోగుల్ని నియమించుకున్నందునే ఇప్పుడు తొలగించాల్సి వస్తోందని లక్కడ్‌ అన్నారు. టీసీఎస్‌ మాత్రం ఒకసారి ఉద్యోగి కంపెనీలోకి ప్రవేశిస్తే వారికి నైపుణ్యాలు అందించి సామర్థ్యంగల ఉద్యోగులుగా మార్చే బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయంలో తమ కంపెనీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీలో 6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు లక్కడ్‌ తెలిపారు. వీరికి గత సంవత్సరాల తరహాలోనే ఈ ఏడాది కూడా వేతన పెంపులు ఉంటాయని తెలిపారు.

మరోవైపు చాలావరకు అంకుర సంస్థలు (Start Up) ఉద్యోగుల్ని తొలగిస్తున్న విషయం తెలిసిందే. అలా ఉద్వాసనకు గురైనవారిని టీసీఎస్‌ నియమించుకునే యోచనలో ఉందని లక్కడ్‌ తెలిపారు. ముఖ్యంగా ఎడ్యుటెక్‌, కృత్రిమ మేధ, క్లౌడ్‌ వంటి రంగాల స్టార్టప్‌ల నుంచి ఉద్వాసనకు గురైన ఉద్యోగుల్ని నియమించుకుంటామని పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో టీసీఎస్‌ రెండు లక్షల మందిని నియమించుకున్నట్లు తెలిపారు. వీరిలో రూ.1.19 లక్షల మంది ట్రైనీలున్నారని చెప్పారు. వీరు ఇంకా ప్రాజెక్టుల్లో చేరుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కొత్త నియామకాల పక్రియ నెమ్మదించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నికర ఉద్యోగుల సంఖ్యాపరంగా వచ్చే కొన్ని త్రైమాసికాల పాటు కొత్త ఉద్యోగుల చేరికలు పెద్దగా ఉండకపోవచ్చునన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని