Zuckerberg: మస్క్‌ లైట్‌ తీసుకున్నాడు..: జుకర్‌ బర్గ్‌ అసహనం

మస్క్‌-జుకర్‌ బర్గ్‌ మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. తనతో ఫైట్‌కు మస్క్‌ సిద్ధంగా లేరని జుకర్‌ బర్గ్‌ అంటుండగా.. తాను రేపే సిలికాన్‌ వ్యాలీ వెళతానని మస్క్‌ చెబుతున్నారు.

Updated : 14 Aug 2023 11:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌ దిగ్గజాలు ఎలాన్‌ మస్క్‌(Elon Musk).. జుకర్‌ బర్గ్‌ ( Mark Zuckerberg) మధ్య ఆన్‌లైన్‌లో మాటల యుద్ధం మొదలైంది. మస్క్‌ తనతో కేజ్‌ఫైట్‌కు డేట్లు ఇవ్వడంలేదని జుకర్‌ బర్గ్‌ ఆరోపిస్తుండగా..  అతడి ఇంటి తలుపు తట్టడానికి రేపటి వరకు తాను వేచి ఉండలేనని మస్క్‌ అంటున్నారు.

టెస్లా (Tesla) అధినేత ఎలాన్‌ మస్క్‌ తనతో ‘కేజ్‌ఫైట్‌’ తేలిగ్గా తీసుకున్నారని.. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తానని మెటా బాస్‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ పేర్కన్నారు. ఆయన సామాజిక మాధ్యమం థ్రెడ్స్‌లో ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. ‘‘ఎలాన్‌ మస్క్‌ ఈ పోటీని గంభీరంగా తీసుకోవడం లేదు. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారని అనుకుంటున్నాను. నేను ఇప్పటికే మస్క్‌కు ఓ డేట్‌ను సూచించాను. డాన వైట్‌ ఈ పోటీని చట్టబద్ధం చేయడానికి అంగీకరించారు. కానీ, మస్క్‌ మాత్రం ఇప్పటి వరకు డేట్‌ను ఎంపిక చేయలేదు. తనకు శస్త్రచికిత్స అవసరమని చెబుతాడు. ఇప్పుడేమో తన ఇంటి పెరట్లో ఓ ప్రాక్టిస్‌ రౌండ్‌ ఆడదామంటాడు. అతడు అధికారిక ఈవెంట్‌ను సీరియస్‌గా తీసుకొని తేదీ అనుకొంటే.. నన్ను ఎలా సంప్రదించాలో అతడికి తెలుసు. లేకపోతే.. నేను ముందుకు సాగిపోతాను. మరెవరితోనైనా పోటీపడటంపై దృష్టిపెడతాను’’ అని జుకర్‌బర్గ్‌ వెల్లడించారు.

హైదరాబాద్‌లో విక్రయం కావాల్సిన ఇళ్లు 5% పెరిగాయ్‌

జుకర్‌బర్గ్‌ థ్రెడ్స్‌ పోస్టును ఓ నెటిజన్‌ మస్క్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. తాను సోమవారమే సిలికాన్‌ వ్యాలీకి వెళతానని.. అతడి ఇంటి తలుపు తట్టేందుకు వేచి ఉండలేనని చెప్పారు. అంతేకాదు జుకర్‌ను పందెం కోడితో పోలుస్తూ.. ‘జుక్‌ ఈజ్‌ ఏ చికెన్‌’  అని వ్యాఖ్యానించారు. అతడు అమెరికాలోని ప్రముఖ రెస్టారెంట్‌ చిక్‌ ఫిల్‌కు వెళ్లి చికెన్‌ తినలేడని.. ఎందుకంటే తన జాతిని తానే తిన్నట్లవుతుందనే అర్థం వచ్చేలా సరదాగా వ్యాఖ్యానించాడు.

వాస్తవానికి ఈ టెక్‌ దిగ్గజాల మధ్య కేజ్‌ఫైట్‌ను ఇటలీలో (Italy) నిర్వహించనున్నట్లు కొన్నాళ్ల క్రితం ఎలాన్‌ మస్క్‌ స్వయంగా వెల్లడించారు. ఈ పోరు, వేదికకు సంబంధించి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో మాట్లాడినట్లు వివరించారు. ‘ఈ పోరును నేను, జుకర్‌బర్గ్‌ ఫౌండేషన్లు నిర్వహిస్తాయి (యూఎఫ్‌సీ కాదు). ఎక్స్‌ (మునుపటి ట్విటర్‌)తోపాటు మెటాలలో ఈ కార్యక్రమం లైవ్‌ స్ట్రీమింగ్‌ జరుగుతుంది’ అని ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. అయితే,  ఏ తేదీన ఈ పోరు ఉంటుందనే విషయంపై స్పష్టత లేదు. ఆగస్టు 26న జరిపేందుకు సిద్ధమని జుకర్‌ బర్గ్‌ ప్రకటించినప్పటికీ.. మస్క్‌ నుంచి స్పష్టత రాలేదు. దీంతో మస్క్‌ జాప్యంపై జుకర్‌ బర్గ్‌ అసహనం వ్యక్తం చేస్తూ తాజాగా థ్రెడ్స్‌లో పోస్టు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని