
గుంటూరు జిల్లాలో దారుణం.. ఇష్టంలేని పెళ్లి చేసుకున్నారని నవ దంపతులపై దాడి!
అమరావతి: మతాలు వేరైనా వారి మనసులు కలిశాయి. మనువాడేందుకు కుటుంబాల కట్టుబాట్లు అడ్డొచ్చాయి. వాటన్నింటినీ దాటుకొని మరీ పెళ్లి చేసుకున్నారు గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం కండ్రిగకు చెందిన చందు, బేతపూడికి చెందిన కౌసర్. ఈ నెల 19న గుంటూరులోని శేషాచలం ఆశ్రమంలో ఈ వివాహం జరిగింది. పెద్దల నుంచి తమకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన ఈ ప్రేమికులు ఆశ్రమం నుంచి నేరుగా వెళ్లి జిల్లా ఎస్పీని కలిసి రక్షణ కల్పించమని కోరారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఫిరంగి పురం పోలీసులు ఇరువర్గాల వారిని పిలిపించి నచ్చజెప్పారు. కొత్త దంపతులు పోలీస్ స్టేషన్ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తుండగా యువతి తరపు బంధువులు దాడి చేసి వధువును అపహరించారు. ఆమెను బలవంతంగా బైక్పై ఎక్కించుకుని తీసుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీనిపై చందు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులైనా తన భార్య ఆచూకీ తెలియలేదని ఆందోళన చెందుతున్నాడు.