crime news: యువకుడి ఆత్మహత్య.. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పై సస్పెన్షన్‌ వేటు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పిచ్చుక మజ్జి అనే యువకుడి ఆత్మహత్యకు కారణమయ్యారనే ఆరోపణలపై కృష్ణా జిల్లా చిల్లకల్లు  పోలీస్‌ స్టేషన్లో పనిచేస్తున్న

Published : 12 Aug 2021 01:24 IST

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పిచ్చుక మజ్జి అనే యువకుడి ఆత్మహత్యకు కారణమయ్యారనే ఆరోపణలపై కృష్ణా జిల్లా చిల్లకల్లు  పోలీస్‌ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శివరామకృష్ణ ప్రసాద్‌ను ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ సస్పెండ్‌ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన చిల్లకల్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ను కూడా సస్పెండ్‌ చేశారు. 

వివరాల్లోకి వెళితే...రాజమహేంద్రవరానికి చెందిన పిచ్చుక మజ్జిపై గతేడాది అక్రమ మద్యం రవాణా చేస్తున్నాడనే కారణంతో చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే, అరెస్టు పెండింగ్‌లో ఉందని.. 41 నోటీసు అందజేయాలని అతడిని చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్‌కు వచ్చిన యువకుడిని విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ శివరామకృష్ణ ప్రసాద్‌ రూ.లక్ష లంచం డిమాండ్‌ చేశారని, డబ్బులు ఇస్తేనే అతనిపై ఉన్న కేసులు మాఫీ చేస్తానని, లేకుంటే గంజాయి అక్రమ రవాణా కేసులు బనాయిస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ మజ్జి సెల్ఫీ వీడియో తీసి ఇంటి వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి మరణానికి కారణమైన కానిస్టేబల్‌ శివరామకృష్ణ ప్రసాద్‌, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌లపై జిల్లా ఎస్పీ సస్పెన్షన్‌ వేటు వేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై శాఖాపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, వారిని విధుల నుంచి తొలగించడానికి సైతం వెనుకాడబోనని ఎస్పీ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని