logo

కమిటీ ఏర్పాటు ఊసే లేదు.. సాగర్‌ ప్రక్షాళన జాడే లేదు

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన, కాలుష్య నియంత్రణ, వ్యర్థ జలాల శుద్ధి ప్రక్రియపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు అమలు కావడం లేదు. పట్టణాభివృద్ధిశాఖ, అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని సంయుక్త కమిటీ పర్యవేక్షించాలని నెలలోపు సమావేశమై ఆరు నెలల ప్రణాళిక సిద్ధం చేయాలని జులైలో ఆదేశించింది.

Updated : 07 Oct 2022 04:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన, కాలుష్య నియంత్రణ, వ్యర్థ జలాల శుద్ధి ప్రక్రియపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు అమలు కావడం లేదు. పట్టణాభివృద్ధిశాఖ, అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని సంయుక్త కమిటీ పర్యవేక్షించాలని నెలలోపు సమావేశమై ఆరు నెలల ప్రణాళిక సిద్ధం చేయాలని జులైలో ఆదేశించింది. ఇప్పటివరకూ కమిటీ సమావేశమైన దాఖాలాలు లేవు. హైకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ సైతం హుస్సేన్‌సాగర్‌ను చూసి నిర్ఘాంతపోయారు. సాగర ప్రక్షాళనకు 2006-2021 వరకు రూ.400 కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం. కూకట్‌పల్లి నాలా మళ్లింపు పనులను పూర్తిచేసినట్లు ప్రకటించినా వ్యర్థాలు జలాశయంలోకి వస్తున్నాయి.  2 లక్షలు విగ్రహాలు నిమజ్జనమై మట్టి, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రసాయనాలు కలిసి సాగర్‌లోని నీరు ఆకుపచ్చగా మారాయి. 7 వేల టన్నుల వ్యర్థాలను తొలగించినా కాలుష్యం తగ్గలేదు.

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలివీ..

* హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరు చేరకుండా అడ్డుకోవడం, వ్యర్థ జలాల శుద్ధి ప్రక్రియను పట్టణాభివృద్ధిశాఖ, అదనపు ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలోని సంయుక్త కమిటీ పర్యవేక్షించాలి. కమిటీ నెలలోపు సమావేశమై ఆరునెలల ప్రణాళికను సిద్ధం చేయాలని జులై 6న స్పష్టం చేసింది.

* 5 ఫీడర్‌ ఛానెళ్ల ద్వారా 376.5 ఎంఎల్‌డీల వ్యర్థాలు చేరుతున్న నేపథ్యంలో నీటి నాణ్యత పెంచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

* ప్రతినెలా సమావేశమై నిర్ణయాలను స్టేట్‌ వెట్‌లాండ్‌ అథారిటీ వెబ్‌సైట్‌లో ఉంచాలని పేర్కొంది.

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు పెట్టిన ఖర్చు

* 2006- రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు

* 2014- రూ.56 కోట్లతో కూకట్‌పల్లి నాలా డైవర్షన్‌

* 2015- వ్యర్థాల తొలగింపు

* 2017, 2018, 2019, 2021- సాగర్‌లో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచేందుకు కెనడా ఎజాక్స్‌ కంపెనీ శాటిలైట్‌ ఆధారిత టెక్నాలజీ వినియోగం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని