logo

మన చెరువు..మన భాగస్వామ్యం

కాలుష్య కాసారాలుగా మారుతున్న చెరువుల దుస్థితిని మార్చేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి నడుం బిగిస్తున్నారు. మురుగునీటి పైపులను నేరుగా చెరువులోకి కలపడం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇష్టారీతిన పారేయడం వంటి చర్యలు...

Published : 28 Mar 2023 03:39 IST

ఈనాడు, హైదరాబాద్‌

కుడికుంట తటాకం వద్ద మొక్కలు నాటుతున్న స్థానికులు

కాలుష్య కాసారాలుగా మారుతున్న చెరువుల దుస్థితిని మార్చేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి నడుం బిగిస్తున్నారు. మురుగునీటి పైపులను నేరుగా చెరువులోకి కలపడం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇష్టారీతిన పారేయడం వంటి చర్యలు నిషిద్ధమంటూ బోర్డులు తగిలించడంతో పాటు వ్యర్థాల ఏరివేత కార్యక్రమాలను నిత్యం చేపడుతూ ‘చెరువే ఆదరవు’ అంటూ ముందుకు కదులుతున్నారు. ప్రభుత్వ అధికారుల సాయంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.

* కొండాపూర్‌లోని కుడికుంట చెరువు ఒకప్పుడు దుర్గంధం, జంతుకళేబరాలతో, వ్యర్థాలతో నిండిపోయి ఉండేది. సాహే సంస్థ ముందుకురాగా.. నెమ్మదిగా స్థానికులు ఇందులో భాగస్వామ్యం అయ్యారు. సుమారు నాలుగున్నరేళ్ల శ్రమ తర్వాత పూర్వ రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సోలార్‌ ప్యానెళ్ల ద్వారా అండర్‌ వాటర్‌ పవర్‌ ఏరియేటర్లు ఏర్పాటు చేయడం, మురుగు కలవకుండా డ్రెయిన్‌ స్ట్రీమ్‌, 12 ఇన్‌లెట్‌లు, వరద నీటి కోసం ఓ స్టార్మ్‌ ఇన్‌లెట్‌ ఏర్పాటు చేశారు. ఆక్రమణలు అడ్డుకునేందుకు 1200కు పైగా మొక్కలు నాటారు.

మణికొండలో ఎల్లమ్మ కాసారం కమ్యూనిటీ లేక్‌ వద్ద వ్యర్థాల సేకరణ

* శేరిలింగంపల్లిలోని గోపి చెరువు పరిరక్షణకు స్థానికులతో కలిసి బ్లూ హైదరాబాద్‌ సంస్థ పనిచేస్తోంది. పరిసర ప్రాంతాల్లో మూడు మురికివాడలున్నాయి. చుట్టుపక్కల కాలనీల నుంచి వ్యర్థాలు, మురుగునీరు ఈ చెరువులోకి మళ్లేది. స్థానిక మహిళలు బృందాలుగా ఏర్పడి వ్యర్థాలను డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. తరచూ లేక్‌ క్లీనప్‌ చేపట్టడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. డ్రైనేజీ మళ్లకుండా, వ్యర్థాలు పారేయకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

* చందానగర్‌ సమీపంలోని చిన్నమైసమ్మ చెరువు, దీప్తిశ్రీనగర్‌ కాలనీ సమీపంలోని రేగులకుంట చెరువు వద్ద సుమారు 1000 మొక్కలను స్థానికులు నాటారు. ఆక్రమణలను తొలగించేలా పోరాడారు. సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యార్డు నుంచి మురుగు రావడంతో దానిని అక్కడి నుంచి తరలించేందుకు బ్లూహైదరాబాద్‌తో కలిసి పనిచేశారు. గోపన్‌పల్లిలోని మరో చెరువు చుట్టూ ఉన్న వందల సంఖ్యలో నివాస సముదాయాల కాలనీవాసులు సమావేశాలు నిర్వహించుకుని, లేక్‌క్లీనప్‌లు నిర్వహిస్తున్నారు. మణికొండలోని ల్యాంకోహిల్స్‌ ఎల్లమ్మ చెరువు కమ్యూనిటీ లేక్‌ వాక్‌, క్లీనప్‌ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని