logo

Hyderabad: అన్నా చనిపోతున్నా.. ఇక నేను కలవను.. ఇదే నా చివరి కాల్‌

అన్నా.. నేను చనిపోతున్నా.. ఇదే నా చివరి కాల్‌.. ఇక నేను కలవను.. క్షమించండంటూ ఓ యువకుడు తన సోదరుడికి ఫోన్‌ చేసి రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.

Updated : 29 May 2023 07:37 IST

ఆర్థిక సమస్యలతో యువకుడి బలవన్మరణం

శివసాయి గణేశ్‌

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: అన్నా.. నేను చనిపోతున్నా.. ఇదే నా చివరి కాల్‌.. ఇక నేను కలవను.. క్షమించండంటూ ఓ యువకుడు తన సోదరుడికి ఫోన్‌ చేసి రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.

రైల్వే పోలీసులు, మృతుడి సోదరుడి వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌కు చెందిన కేదరిశెట్టి శివసాయి గణేశ్‌(22) తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి నుంచి కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌కు సుమారు కరోనా మొదటి లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబంతో వచ్చాడు. స్థానికంగా మిర్చిబజ్జీ బండి నడిపిస్తున్నాడు. ఇతని సోదరుడు మణికంఠ మాదాపూర్‌లో అదే వ్యాపారం చేస్తుంటాడు. అంతా కలిసే ఉంటారు. శనివారం మణికంఠ పుట్టినరోజు కావడంతో స్నేహితులతో బయట ఉన్న సమయంలో రాత్రి 10.24 గంటలకు శివసాయి గణేశ్‌ ఫోన్‌ చేసి చనిపోతున్నా.. అని చెప్పగా  ఏం జరిగిందని మణికంఠ అంటుండగానే ఫోన్‌ ఆపేశాడు.

వెంటనే ఇంటికి చేరుకున్న మణికంఠ విషయం చెప్పి సమీపంలోని హైటెక్‌ సిటీ ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌ చుట్టుపక్కల వాకబు చేసే క్రమంలో శివసాయిగణేశ్‌ రైలు కింద పడి మృతిచెందినట్లు తెలుసుకున్నాడు. తన పుట్టినరోజునే సోదరుడు విగతజీవిగా మారడం చూసి బోరుమన్నాడు. ఆర్థిక సమస్యలు తమతో పంచుకోకుండా ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు విలపించారు. శవపరీక్ష అనంతరం రైల్వే పోలీసులు మృతదేహాన్ని అప్పగించడంతో ఆదివారం అంత్యక్రియలు పూర్తిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని