logo

Hyderabad: విలాసంగా గడపాలని అడ్డదారి తొక్కాడు.. ఫ్రెండ్స్‌తో పార్టీలో దొరికేశాడు!

జూబ్లీహిల్స్‌లో ఇంట్లోకి దూరి మహిళను బెదిరించి రూ.10 లక్షలు కాజేసిన నిందితుడు పటేల్‌ మోతీరాం రాజేష్‌ యాదవ్‌(26)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.9.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 31 May 2023 10:33 IST

గర్భిణి మెడపై కత్తిపెట్టి డబ్బు కొట్టేసిన నిందితుడి అరెస్టు

స్వాధీనం చేసుకున్న కత్తి, నగదును పరిశీలిస్తున్న సీపీ ఆనంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో ఇంట్లోకి దూరి మహిళను బెదిరించి రూ.10 లక్షలు కాజేసిన నిందితుడు పటేల్‌ మోతీరాం రాజేష్‌ యాదవ్‌(26)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.9.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో మంగళవారం నగర సీపీ సీవీ ఆనంద్‌ వివరాలు వెల్లడించారు.

మూడేళ్ల క్రితమే ఆలోచన.. రెజిమెంటల్‌బజార్‌కు చెందిన రాజేష్‌యాదవ్‌ గచ్చిబౌలిలో టెలీకాలర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, మద్యం అలవాటైంది. గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు చేరవేసే కంపెనీ వాహనం రోజూ జూబ్లీహిల్స్‌ మీదుగా ప్రయాణించేది. ఆ ప్రాంతంలోని భవనాలు, ఖరీదైన కార్లను గమనించేవాడు. 2020లో బుర్రలో నాటుకున్న ఆలోచనను మూడేళ్ల తరువాత అమలు పరిచాడు. ఈ నెల 12 తెల్లవారుజామున 4 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 52లోకి ప్రవేశించాడు. వ్యాపారి రాజు ఇంట్లోకి ఓ గదిలో ప్రవేశించాడు. ఆ గదిలో వ్యాపారి కుమార్తె ఉంది. ఆమె 8 నెలల గర్భవతి. ఎదురుగా ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌజ్‌లు, ఒక చేత్తో  పదునైన కత్తిపట్టుకొని నిలబడ్డ అగతంకుడిని చూడగానే షాక్‌ గురైంది. ఆమె తేరుకునేలోపు మెడపై కత్తి ఉంచాడు. ఇంట్లో ఉన్న వారందరినీ ఒక గదిలో కూర్చొబెట్టాడు. వయోధికులైన తల్లిదండ్రుల ఫోన్లు లాక్కొని ఫ్లైట్‌మోడ్‌లో ఉంచాడు. రూ.20 లక్షలు నగదు కావాలని డిమాండ్‌ చేశాడు. ఇవ్వకుంటే చంపుతానంటూ బెదిరించాడు. అక్కడే మద్యంతాగుతూ కూర్చున్నాడు. తమ వద్ద అంత నగదు లేదని చెప్పటంతో రూ.10 లక్షలకు దిగాడు. తల్లిదండ్రుల వద్ద ఉన్న రూ.2లక్షలు ఇవ్వగానే.. గర్భిణి భర్త నుంచి రూ.8లక్షలు తెప్పించాలన్నాడు. ఆందోళనకు గురైన ఆమె మెడికల్‌ ఎమర్జెన్సీ అంటూ భర్తకు ఫోన్‌ చేసి రూ.8 లక్షలు అడిగారు. తాను రాకుండా ఎవరితో అయినా పంపాలంటూ ఆమె కోరడంతో అదే విధంగా చేశాడు. రూ.10 లక్షలు చేతికి రాగానే ఆమె ఫోన్‌ నుంచే క్యాబ్‌ బుక్‌చేసుకొని అక్కడి నుంచి షాద్‌నగర్‌ చేరాడు.

 ఫోన్‌వాడకుండా.. సీసీ కెమెరాలకు చిక్కకుండా నిందితుడు జాగ్రత్తపడ్డాడు. పశ్చిమమండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో  500కు పైగా సీసీ కెమెరాల ఫుటేజ్‌ను సేకరించారు. క్యాబ్‌డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం. నిందితుడు సికింద్రాబాద్‌ వచ్చినట్లు గుర్తించారు. కీసర యాదగిరిపల్లిలో స్నేహితులతో విందు పార్టీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే కాజేసిన నగదుతో ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. అప్పులు తీర్చినట్లు గుర్తించారు. నిందితుడి ద్వారా రూ.9.50లక్షలు రాబట్టి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని