logo

లైంగిక నేరస్థులపై నిఘా

మహిళలు, చిన్నారుల భద్రత లక్ష్యంగా సైబరాబాద్‌ పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లైంగిక నేరస్థులపై నిఘా, గస్తీ(సెక్సువల్‌ అఫెండర్స్‌ పెట్రోల్‌ అండ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రాం) కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు.

Published : 08 Jun 2023 02:14 IST

సైబరాబాద్‌లో 143 మంది గుర్తింపు
ఈనాడు- హైదరాబాద్‌

నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు (పాత చిత్రం)

మహిళలు, చిన్నారుల భద్రత లక్ష్యంగా సైబరాబాద్‌ పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లైంగిక నేరస్థులపై నిఘా, గస్తీ(సెక్సువల్‌ అఫెండర్స్‌ పెట్రోల్‌ అండ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రాం) కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో నేరస్థులుగా ఉన్నవారు మరోసారి ఈ తరహా దారుణాలకు పాల్పడకుండా అడ్డుకోవడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా కమిషనరేట్‌ పోలీస్‌స్టేషన్ల వారీగా నేరాలకు పాల్పడినవారి వివరాలు సేకరించి.. వారిపై నిఘా ఉంచుతారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే తొలిసారని, లైంగిక నేరాలకు అడ్డుకట్ట పడేందుకు ఉపయోగపడుతుందని ఉన్నతాధికారులు తెలిపారు.

పోలీసులు ఏం చేస్తారు..?

* కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్‌ పరిధిలో ఐదు జోన్లలో కలిపి మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడిన 143 మందిని పోలీస్‌స్టేషన్ల వారీగా గుర్తించారు.

* కమిషనరేట్‌ పరిధిలో వీరంతా ఏయే ప్రాంతాల్లో నివసిస్తున్నారో రికార్డు చేసి.. తమవద్ద ఉన్న పాత వివరాలను అప్‌డేట్‌ చేస్తారు.

* కొత్త ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్నారా అనేది నిఘా వర్గాలతో ఎప్పటికప్పుడు ఆరా తీస్తారు.

* నివసించే ప్రాంతంలో వారి కార్యకలాపాలు, ప్రస్తుత ఏం చేస్తున్నారో ఇరుగుపొరుగు ద్వారా తెలుసుకుంటారు.

* ఠాణా పరిధిలోని బీట్‌, సెక్టార్‌ అధికారులు, స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగం అధికారులు తరచూ వీరి కదలికలు గమనిస్తూ ఉంటారు. అనుమానం వస్తే అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహిస్తారు.

* మే 25న తొలి విడత కింద కమిషనరేట్‌ వ్యాప్తంగా 143 మందిని తనిఖీ చేశారు.

భవిష్యత్తులో ఇతర కేసుల్లోని వారిపైనా దృష్టి.. లైంగిక కేసులతో పాటు ఇతర తీవ్ర నేరాల్లో నిందితులపైనా నిరంతర నిఘా ఉంచే కార్యక్రమం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హత్య, మాదకద్రవ్యాల రవాణా, ఇతర తీవ్ర నేరాల్లో నిందితుల డేటా సేకరించి, వారి కార్యకలాపాలపై నిఘా ఉంచుతామని అధికారులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని