logo

వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి

అనారోగ్యం అధిగమించలేక, ఆర్థిక కారణాలు తట్టుకోలేక మనస్తాపంతో జిల్లాకు చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపాయి.

Published : 20 Jan 2022 02:47 IST

అనారోగ్యం అధిగమించలేక, ఆర్థిక కారణాలు తట్టుకోలేక మనస్తాపంతో జిల్లాకు చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపాయి.

కడుపు నొప్పి తాళలేక యువకుడు..

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: కడుపునొప్పి తాళలేక ఖమ్మం నగరంలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన యువకుడు చెన్నా కరుణాకర్‌(24) ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామీణ మండలం వెంకటగిరి క్రాస్‌రోడ్డు వద్ద కరుణాకర్‌ గాలిమిషన్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో కుటుంబ సభ్యులు తలుపులు తీయగా అప్పటికే కరుణాకర్‌ మృతి చెందాడు. కరుణాకర్‌కు ఆరు నెలల క్రితమే వివాహం అయింది. మృతుని తండ్రి వీరబాబు ఫిర్యాదు మేరకు మూడో పట్టణ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  


క్యాన్సర్‌తో బాధపడుతూ వృద్ధురాలు..

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఉమ్మినేని రామలక్ష్మి(72) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. ఖమ్మం కవిరాజనగర్‌లో నివాసం ఉండే ఉమ్మినేని రంగయ్య సతీమణి రామలక్ష్మి క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఈమెకు విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈక్రమంలో ఆమె మానసికంగా బాధపడుతుండగా, భర్త రంగయ్య ధైర్యం చెబుతున్నారు. బుధవారం ఖమ్మం గ్రామీణం మండలంలోని మారెమ్మగుడికి వెళ్లి వస్తానంటూ ఇంట్లో నుంచి బయలుదేరిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. మారెమ్మగుడి వద్ద గుర్తుతెలియని పురుగులమందు తాగి పడిపోయి ఉండగా మధ్యాహ్నం సమయంలో 108 వాహన సిబ్బంది ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మనస్తాపంతో వివాహిత..

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: మద్యానికి బానిసై మనస్తాపంతో పురుగుమందు తాగి చికిత్సపొందుతూ వివాహిత మృతి చెందిన సంఘటన రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవి కథనం ప్రకారం... గోగుల సత్యవతి(42) గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసైంది. ఈక్రమంలో మంగళవారం భర్త సహదేవ మందలించడంతో పొలానికి వెళ్లి గుర్తుతెలియని పురుగుమందు తాగి స్పృహతప్పి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఆమె కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ వివరించారు.


తన కార్యాలయంలోనే మిరప వ్యాపారి..

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: పురుగులమందు తాగి మిరప వ్యాపారి బలన్మరణానికి పాల్పడిన సంఘటన ఖమ్మం నగరంలోని జమలాపురం పార్కు ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌నగర్‌కు చెందిన ఏపూరి కృష్ణయ్య(55) గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్‌లో మిర్చి వ్యాపారం చేస్తున్నాడు. మూడో నగర ప్రాంతంలోని బోసుబొమ్మ సెంటర్‌లో దగ్గర జమలాపురం పార్కు సమీపంలోని తన కార్యాలయంలో పురుగుల మందు తాగి బలన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటనపై బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో పట్టణ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని