logo

రేషన్‌ ఈ- కేవైసీకి మరో అవకాశం.. త్వరగా పూర్తి చేసుకోవాలని అధికారుల సూచన

ఆహారభద్రత కార్డుల ఈ- కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్‌ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది.

Updated : 17 Apr 2024 08:36 IST

రాజపేట, భువనగిరి, న్యూస్‌టుడే: ఆహారభద్రత కార్డుల ఈ- కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్‌ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం లబ్ధిదారుల్లో 74 శాతం మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసుకున్నారు. మిగిలిన వారి కోసం మరో అవకాశం ఉండకపోవచ్చని,  త్వరగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,740 గ్రామ పంచాయతీలకు గానూ 2,081 రేషన్‌ దుకాణాలున్నాయి. ఇందులో మొత్తం 10,07,214 రేషన్‌ కార్డులుండగా, 29,85,553 మంది రేషన్‌ లబ్ధిదారులున్నారు. ఇంకా వివిధ కారణాల వల్ల 7,96,023 మంది ఈ కేవైసీ చేయించుకోనట్లుగా అధికారవర్గాలు తెలుపుతున్నాయి.

సంక్షేమ పథకాలు అర్హుల లబ్ధికే..

సంక్షేమ పథకాలు అర్హులకే అందించడానికి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రేషన్‌ కార్డులకు ఈ- కేవైసీ తప్పనిసరి చేసింది. దీని కోసం శాఖాపరంగా అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టారు. ఈ విషయమై తమకు అందుబాటులో ఉన్న రేషన్‌ దుకాణాలకు వెళ్లి ఈ కేవైసీ చేసుకోవాలని పౌరసరఫరాల అధికారులు సూచించారు. పలు దఫాలుగా అవకాశం ఇచ్చినా ఇంకా మిగిలిపోయిన కారణంగా ఎక్కువ మందికి నష్టం కలిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం రేషన్‌ దుకాణాల్లో నమోదు చేసుకోవడానికి మరోమారు అవకాశం కల్పించింది. అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ప్రధాన సమస్యలివే..

వేలిముద్రలు పడక, సాంకేతిక సమస్యలతో కొంతమేర జాప్యం జరుగుతోంది. దీనికితోడు చిన్నారుల ఆధార్‌ నవీకరణ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలువురు వృద్ధుల వేలిముద్రలు పడటం లేదు. మీసేవా, ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి నవీకరణ పూర్తి చేసుకున్నా ఈ కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడంలేదు. వలస వెళ్లిన వారి కోసం అక్కడుండే రేషన్‌ షాపుల్లో ఈ కేవైసీ చేసుకునే వెసులుబాటు ఉన్నా కొందరు డీలర్లు తమ పరిధిలోని వారికే కేవైసీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ కేవైసీ ఆవశ్యకత విషయమై రేషన్‌ డీలర్లకు, లబ్ధిదారులకు అధికారులు పలు రకాలుగా సూచనలు చేస్తూనే ఉన్నారు. అవకాశం ఉందికదా అని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే రేషన్‌ దుకాణాలకు వెళ్లి ఈ కేవైసీ చేయించుకోవాలంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని