logo

చెరువులు కప్పేస్తూ కట్టడాలు

నిజామాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చెరువులు అన్యాక్రాంతమవుతున్నా.. అడ్డుకునేవారు లేరు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు వెళుస్తున్నా.. అడిగేవారుండరు.

Published : 03 Jun 2023 05:28 IST

పరిరక్షణ చర్యలు మరిచిన యంత్రాంగం

శిఖంలో విద్యుత్తు స్తంభం (వృత్తంలో)

ఈనాడు, నిజామాబాద్‌, న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌ : నిజామాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చెరువులు అన్యాక్రాంతమవుతున్నా.. అడ్డుకునేవారు లేరు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు వెళుస్తున్నా.. అడిగేవారుండరు. పురపాలకశాఖ ఏమీ చూడకుండా ఇంటి నంబర్లు జారీ చేస్తోంది. వాటిని అడ్డంపెట్టుకొని విద్యుత్తు కనెక్షన్లు తీసుకుంటున్న పరిస్థితి ఉంటోంది. బఫర్‌ జోన్‌ నిబంధనలు, జలవనరులశాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు లేకుండానే కానిచ్చేస్తున్నారు. శాఖల మధ్య సమన్వయం లోపం ఆక్రమణలకు బలం చేకూరుస్తోంది.

కబ్జా కోరల్లో    

నిజామాబాద్‌ నగరం నాగారం పరిధి సర్వే నంబరు 2999లోని బొందెం చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఏడాదిన్నర కిందట జలవనరుల, నీటిపారుదల, రెవెన్యూ అధికారులు చుట్టూ హద్దుగా కందకం తవ్వించినా.. అది పూడుకుపోయింది. రెండు దిక్కులా బండరాళ్ల గుట్ట ఉంది. మిగతా రెండు వైపులా నిర్మాణాలు వెలవడంతో 23.7 ఎకరాల ఈ జలవనరులోకి నీరు చేరే అవకాశమే లేకుండా పోయింది. ఫలితంగా పిచ్చిమొక్కలతో మైదాన ప్రాంతంగా మారింది. ఈ క్రమంలోనే చుట్టుపక్కల నిర్మాణాలు విస్తరించుకుంటూ శిఖంలోకి చొచ్చుకొస్తున్నాయి.

నిబంధనల ఊసేది..?

ఇంటి నిర్మాణాల అనుమతి జారీలో నిబంధనలు పాటించటం లేదు. ఇష్టానుసారం డోర్‌ నంబర్లు జారీ చేస్తున్నారు. విద్యుత్తుశాఖ పూర్తిస్థాయి అనుమతిలేని నిర్మాణాలకు కనెక్షన్లు జారీ చేస్తోంది. నిజానికి నీటివనరులున్న ప్రాంతాల్లో 9 మీటర్ల దూరం వరకు ఎటువంటి కట్టడాలకు అనుమతివ్వవద్దు. జలవనరులశాఖ నుంచి నిరభ్యంతర పత్రం జత చేయాల్సి ఉంటుంది. అలాంటివి లేకుండానే మున్సిపల్‌ వారు అనుమతులిస్తుండటంతో అక్రమ నిర్మాణాలకు అంతులేకుండా పోతోంది.

సమన్వయం మాటే లేదు..

బొందెం చెరువు ప్రాంతంలో గతంలో హద్దులు నిర్ణయించి ట్రంచ్‌ కొట్టించామని దక్షిణ మండలం తహసీల్దారు ప్రసాద్‌ చెప్పారు. ఇక్కడ చేపట్టే నిర్మాణాలకు మున్సిపల్‌ వారు నిబంధనలు చూసి అనుమతిలివ్వాలన్నారు. జలవనరులశాఖ నిరభ్యంతర పత్రం తప్పనిసరి అని తెలిపారు. వారే చెరువు పరిరక్షణకు ఫెన్సింగ్‌ చేయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నీటిపారుదలశాఖ అధికారి రాజ్యలక్ష్మి స్పందిస్తూ... తాము ఎవరికీ నిరభ్యంతర పత్రాలు ఇవ్వటం లేదని చెప్పారు. నిర్మాణాలు చేపట్టడం, విద్యుత్తు లైన్లు వేయటం అనేది మున్సిపల్‌, విద్యుత్తుశాఖల వారు నిబంధనలు చూసి ఇవ్వాలని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఉదంతాలు..

నిజామాబాద్‌ శివారులోని రామర్తి చెరువులోకి నిర్మాణాలు వచ్చేశాయి. నిద్ర నుంచి మేల్కొన్న అధికారులు వాటిని ఏమీ చేయలేక.. మిగిలిన భాగాన్నైనా కాపాడేందుకు ఫెÆన్సింగ్‌ వేయించారు. చెరువు విస్తీర్ణం కుంచించుకుపోవడం వల్ల వర్షాకాలంలో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో తక్కువ సమయంలోనే నిండిపోయి నిజామాబాద్‌-బోధన్‌ రహదారిపైకి నీరు చేరుతోంది. ః భీమ్‌గల్‌ పట్టణానికి ఆనుకొని ఉన్న రాధం, మొగిలి చెరువులది ఇదే పరిస్థితి. రాధం 72 ఎకరాల విస్తీర్ణం ఉండగా.. 20 ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. ఇటీవల సర్వే చేయించిన రెవెన్యూ యంత్రాంగం తదుపరి చర్యలను మరిచింది. మొగిలి విస్తీర్ణం కాగితాలకే పరిమితమైంది. సింహభాగం నిర్మాణాలు వెలిశాయి. ః మాక్లూర్‌ మండలం గుత్ప ప్రాంతంలోని మూడు చెరువులు 100, 60, 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఖజానా చెరువులో 20 ఎకరాలు, నడి, పెచ్చెరువుల్లో పదేసి ఎకరాలు కబ్జాకు గురయ్యాయి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని