ఈ చలిలో.. ఇగ్లూలో.. ఆ కిక్కే వేరు!

ఎత్తైన పర్వతాలు..పచ్చని లోయలు.. హిమానీ నదుల అందాలు.. గలగలపారే సెలయేళ్లు.. సాహసోపేతంగా సాగే నదీయానం.. వీటికితోడు మంచుతో నిర్మించిన ఇగ్లూ ఇళ్లు.. పర్యాటకులను కట్టి పడేస్తున్నాయి. ఇంతకీ ఇవన్నీఎక్కడో బయటి దేశంలో ఉన్నాయనుకుంటే పొరబడినట్లే..

Updated : 28 Dec 2020 17:46 IST

మనాలిలో ప్రత్యేక ఆకర్షణగా ఇగ్లూ హోటల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎత్తైన పర్వతాలు.. తెల్లగా పరుచుకున్న మంచు దుప్పట్లు.. మధ్యలో మంచుతో నిర్మించిన ఇళ్లు. ఇంతకీ ఇవన్నీ ఎక్కడో బయటి దేశంలో ఉన్నాయనుకుంటే పొరబడినట్లే. ఈ ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలంటే హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలికి వెళితే చాలు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇన్ని రోజులూ ఇంట్లోనే ఉన్న పర్యాటక ప్రియులు.. ఈసారి మనాలికి వెళ్తే ఓ సరికొత్త అనుభూతిని పొందొచ్చు. మనం చిన్నప్పుడు సాంఘికశాస్త్రంలో చదువుకున్న ఇగ్లూలు అక్కడ దర్శనమిస్తాయి. ఆ మంచు ఇళ్లలో సరదాగా రెండు మూడు రోజులు గడిపేయొచ్చు. దేశంలోనే మొట్టమొదటి సారి నిర్మించిన ఇగ్లూల్లో ఉంటూ ఆర్కిటిక్‌ ప్రాంత అనుభూతిని పొందొచ్చు.

ప్రకృతి అందాల కలబోత..
మనాలి.. ప్రకృతి అందాలతో నిండిన సుందర ప్రదేశమే కాదు.. సాహస క్రీడలకు అనువైన ప్రాంతం కూడా. ఇది సిమ్లా నుంచి దాదాపు 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి మరో 15 కిలోమీటర్లు వెళ్తే హమ్తా పాస్‌లోని ఇగ్లూ హోస్ట్‌ ప్రాంతానికి చేరుకోవచ్చు. సముద్ర మట్టానికి 9 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ మంచు ఇళ్లను 2017లో సేథన్‌ గ్రామానికి చెందిన వికాస్‌ కుమార్‌, తాషీ అనే ఇద్దరు యువకులు ప్రయోగాత్మకంగా నిర్మించారు. ఈ ఇళ్లలో ఉండాలంటే అడ్వాన్స్‌ బుకింగ్‌ తప్పనిసరి.

ఏటా శీతాకాలంలో ఈ ఇగ్లూలను పర్యాటకుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఏప్రిల్‌ వరకు ఇవి పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చిలోనే మూసివేశారు. కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం తాజాగా వికాస్‌ బృందానికి ఇగ్లూ హోటల్‌ తెరవడానికి అవకాశం ఇచ్చింది. దీంతో ఇగ్లూలను నిర్మించే పనిలో పడింది వికాస్‌ బృందం.

పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
మనాలిలోని ఈ ఇగ్లూలను హోటల్‌గా మార్చారు. ప్రస్తుతం ఆరుగురు వ్యక్తులు దీన్ని నిర్వహిస్తున్నారు. మనాలిలో రాత్రి ఉష్ణోగ్రత మైనస్‌ నాలుగు నుంచి ముప్పై డిగ్రీలకు పడిపోతుంది. అందువల్ల, పర్యాటకులు చలిని తట్టుకునేలా జనరేటర్‌ సాయంతో హీటర్లను ఏర్పాటు చేశారు. ఇగ్లూ లోపల ఎండుగడ్డి, విద్యుత్‌ దీపాల ఏర్పాటు ఉంటుంది. చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రత్యేక దుస్తులు, వేడి నీళ్ల బాటిళ్లు సైతం అందుబాటులో ఉంటాయి. అలాగే రాత్రి ఇక్కడ బస చేసే వారికి అల్పాహారం, టీ, కాఫీతో పాటు శాకాహారం, మాంసాహారంతో చేసిన వివిధ రకాల వంటకాలు సైతం లభిస్తాయి.

అందుబాటులో ప్యాకేజీలు..
ఇగ్లూలో ఉండేందుకు ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కేవలం పగటి వేళ మాత్రమే అయితే పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. పగలు, ఒకరాత్రి ఉండేందుకు రూ.5,500 వసూలు చేస్తున్నారు. అలాగే రెండు రాత్రులు, మూడు రోజుల ప్యాకేజీకి ఒక్కో వ్యక్తికి రూ.పదివేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆరేళ్లలోపు పిల్లలకు ఇక్కడికి అనుమతి లేదు. వీటితో పాటు పగటి వేళ స్కేయింగ్‌, స్నో బోర్డింగ్‌ వంటి ఆటలతోపాటు రోహతాంగ్‌ పాస్‌, చంద్రఖని పాస్‌, సోలాంగ్‌ లోయ, సుల్తాన్‌పుర ప్యాలెస్‌ వంటి ప్రదేశాలను చూడొచ్చు. చలిని తట్టుకునేలా మంచు సూట్, చేతి తొడుగులు, సాక్సులు, బూట్లు కూడా ఇక్కడ అద్దెకు లభిస్తాయి. వీటితోపాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్న సిబ్బంది పర్యాటకుల వెంట ఉంటారు. వీరు టూర్‌ మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు సందర్శకులతోనే ఉండి కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని