WHO+చైనా: ట్రంప్‌ చెప్పిందే పచ్చి నిజం!

కరోనా వైరస్‌పై చైనా సరైన సమయంలో సరైన సమాచారం ఇవ్వలేదు. మహమ్మారిని అరికట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైంది. డ్రాగన్‌ దేశానికి అనుకూలంగా ప్రవర్తించింది. ప్రపంచ దేశాల ప్రయోజనాలను పరిరక్షించలేకపోయింది. అది చైనా ప్రభావం నుంచి బయటపడాలి. -అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌....

Updated : 02 Jun 2020 19:59 IST

కరోనా సమాచారం ఇచ్చేందుకు కావాలనే  చైనా ఆలస్యం

చిరాకు వచ్చినా చైనాపై ప్రశంసలకే డబ్ల్యూహెచ్‌వో పరిమితం

కరోనా వైరస్‌పై చైనా సరైన సమయంలో సరైన సమాచారం ఇవ్వలేదు. మహమ్మారిని అరికట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైంది. డ్రాగన్‌ దేశానికి అనుకూలంగా ప్రవర్తించింది. ప్రపంచ దేశాల ప్రయోజనాలను పరిరక్షించలేకపోయింది. అది చైనా ప్రభావం నుంచి బయటపడాలి. -అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.

తరిచి చూస్తే అగ్రరాజ్యం అధ్యక్షుడి మాటలే నిజమని తెలుస్తోంది. కొవిడ్‌-19 వైరస్‌ జన్యుపరివర్తన క్రమాన్ని చైనా దురుద్దేశ పూర్వకంగానే ఆలస్యంగా బహిర్గతం చేసిందని తెలుస్తోంది. ఇన్నాళ్లూ చైనా గొప్ప, చైనా సత్వరమే స్పందించింది, వేగంగా వివరాలను పంచుకుందని బాకా ఊదిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులే అదంతా నిజం కాదని చెప్పినట్టు అసోసియేట్‌ ప్రెస్‌ (ఏపీ) సంచలన విషయాలను బయటపెట్టింది.


జనవరి మొత్తం ప్రశంసలే

నిజానికి ఈ ఏడాది జనవరి నెల మొత్తం చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసిస్తూనే ఉంది. డ్రాగన్‌ ప్రభుత్వం వెనువెంటనే వైరస్‌ జెనెటిక్‌ మ్యాప్‌ను పంచుకుందని చెప్పింది. అంతేకాదు, అందుకు ధన్యవాదాలు తెలిపింది. వాస్తవంగా చైనాలోని ప్రయోగశాలలు ఈ పనిని ఎప్పుడో చేశాయి. జన్యు పరివర్తన క్రమాన్ని డీకోడ్‌ చేశాయి. అయితే వైరస్‌ నిర్ధారణ పరీక్షలు, ఔషధాలు, వ్యాక్సిన్‌ తయారీకి అత్యంత అవసరమైన ఈ వివరాలను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం కొన్ని వారాల తర్వాత గానీ వెల్లడించలేదని తెలిసింది. సమాచారం బయటకు రాకుండా కఠిన నిబంధనలు అమలు చేసింది.


సమాచారం ఆలస్యం

వైరస్‌ సమాచారంపై కఠిన నిబంధనలు, చైనా ప్రజారోగ్య వ్యవస్థలోనే అంతర్గత పోటీ ఆలస్యానికి కారణంగా అంతర్గత పత్రాలు, ఈమెయిళ్లు, ఇంటర్వ్యూల ద్వారా తెలుస్తోందని ఏపీ కుండబద్దలు కొట్టింది. డ్రాగన్‌ ప్రభుత్వ అధికారులు జనవరి 11న జీనోమ్‌ వివరాలను ప్రచురించగా అంతకన్నా ముందే అక్కడి ల్యాబ్‌ ఒకటి వివరాలను ప్రచురించడం గమనార్హం. అత్యంత అవసరమైన ఈ వివరాలను డబ్ల్యూహెచ్‌వోకు సైతం ఇచ్చేందుకు చైనా కనీసం రెండు వారాలు ఆలస్యం చేసిందని ఆ సంస్థ అంతర్గత సమావేశాల ద్వారా తెలిసిందని ఏపీ తెలిపింది. అప్పటికి కరోనా వైరస్‌ అంటువ్యాధిగా ప్రకటించలేదు.


డబ్ల్యూహెచ్‌  ప్రతినిధుల ఆవేదన

కొవిడ్‌-19పై చైనా సరైన, అవసరమైన సమాచారం సమగ్రంగా ఇవ్వలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు సైతం ఆవేదన చెందారట. వివరాలు లేకపోవడంతో కొత్త వైరస్‌ ఏ మేరకు ప్రమాదకరమో, ప్రపంచానికి ఎంత కీడు చేస్తుందో డబ్ల్యూహెచ్‌వో అంచనా వేయలేకపోయిందని ఏపీ వివరించింది. ‘సీసీటీవీలో వివరాలు వెల్లడించేందుకు 15 నిమిషాల ముందు మాకు సమాచారం ఇచ్చారన్నది నిజమే’ అని చైనాలోని డబ్ల్యూహెచ్‌లో అత్యున్నత అధికారి డాక్టర్‌ గాడెన్‌ గాలీ చెప్పడం గమనార్హం. అప్పటికే వివరాలు దాస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య సంస్థపై ముప్పేట దాడి మొదలుపెట్టేశారు. మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో చైనా, అమెరికా మధ్యన డబ్ల్యూహెచ్‌వో అడకత్తెరలో పోకచెక్కలా ఇరుక్కుపోయింది.


చైనాను రక్షించేందుకు నిందల పాలు

ప్రపంచ ఆరోగ్యానికి అవసరమైన సమాచారాన్ని పంచుకోవాలన్న అంతర్జాతీయ చట్టాలు ఉన్నప్పటికీ సభ్య దేశాలను కఠినంగా డిమాండ్‌ చేసే అధికారాలు డబ్ల్యూహెచ్‌వోకు లేవు. అందుకే చైనా అరకొర సమాచారమే ఇచ్చినా బతిమాలడం మినహా ఏమీ చేయలేకపోయింది. తాను చీకట్లో కూరుకుపోతూ, నిందల పాలవుతూ చైనాను వెలుగులో ఉంచింది. సమాచారం ఇవ్వడం లేదని ప్రపంచానికి బహిర్గత పరచకుండా డ్రాగన్‌ దేశం ఎంతగానో సహకరిస్తున్నట్టు ప్రపంచం ముందు నటించింది! జన్యు పరివర్తన క్రమాన్ని వేగంగా ఆవిష్కరించిన శాస్త్రవేత్తలను నొప్పించకుండా చైనాపై ఎలా ఒత్తిడి చేయాలో డబ్ల్యూహెచ్‌వోకు తెలియక ప్రశంసలు కురిపించిందట.


మరిన్ని ప్రశ్నలకు నిరాకరణ

‘డబ్ల్యూహెచ్‌వో చైనాను రక్షించాలంటే స్వతంత్రంగా విశ్లేషణ చేయాలి. లేదంటే వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే విషయం ప్రశ్నార్థకం అవుతుంది. ఇతర దేశాలు దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాయి’ అని ఆరోగ్య సంస్థ ఎమర్జన్సీ చీఫ్‌ డాక్టర్‌ మైకేల్‌ రేయాన్‌ అనడం గమనార్హం. జనవరి 2న వైరస్‌ను తొలిసారి డీకోడ్‌ చేయగా జనవరి 30న డబ్ల్యూహెచ్‌వో కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. ఈ మధ్యలో వైరస్‌ 100-200 రెట్ల వేగంతో వ్యాపించిందని చైనా వ్యాధుల నియంత్రణ సంస్థ సమాచారాన్ని బట్టి తెలిసింది. మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరగా రికార్డు చేస్తే ఇవ్వలేమని డబ్ల్యూహెచ్‌వో అధికారులు నిరాకరించారట.


ల్యాబుపై రహస్య ఆంక్షలు

గతేడాది డిసెంబర్లోనే విచిత్రమైన నిమోనియాతో రోగులు చైనాలోని ఆస్పత్రులకు పోటెత్తారు. కారణమేంటో తెలుసుకొనేందుకు నమూనాలు తీసుకొని ప్రైవేటు ల్యాబులకు పంపించారు. విజన్‌ మెడికల్స్‌ అనే సంస్థ డిసెంబర్‌27న ఈ వైరస్‌ గతంలోని సార్స్‌ను పోలివుందని తెలిపింది. వుహాన్‌ అధికారులను అప్రమత్తం చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వారు నిమోనియాపై హెచ్చరిస్తూ అంతర్గత నోటీసులు జారీ చేశారు. డిసెంబర్‌ 30న వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లోని కరోనా వైరస్‌ నిపుణులు షి ఝెంగ్లి కొవిడ్‌-19పై అప్రమత్తం చేశారు. జనవరి 2న ఆమె బృందం వైరస్‌ను పూర్తిగా డీకోడ్‌ చేసింది. ఈ సమాచారాన్ని ప్రపంచంతో పంచుకొనేందుకు మాత్రం ఆ దేశం వక్రంగా ప్రవర్తించింది. తమ అనుమతి లేకుండా వివరాలు ఇవ్వకూడదని ల్యాబులకు రహస్య నోటీసులు జారీ చేసింది. దాంతో షి ఝెంగ్లీ బృందం వీటిని ఇవ్వలేకపోయింది. ప్రపంచానికి ఉన్న ముప్పును చెప్పలేకపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని