Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Mar 2023 13:09 IST

1. కవర్లలో పాత ఫోన్లతో.. ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత మూడోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు హాజరయ్యారు. విచారణకు ఆమె రావడం వరుసగా ఇది రెండోసారి. సోమవారం 10 గంటలపాటు విచారించిన ఈడీ.. మంగళవారం కూడా రావాలని కోరడంతో కవిత విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు ఆమె తన పాత మొబైళ్లను మీడియా ఎదుట ప్రదర్శించారు. కవర్లలో వాటిని తీసుకెళ్తున్నట్లు చూపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నెలకు రూ.599-1499 అద్దెపై ఎయిర్‌టెల్‌ కుటుంబ పథకాలు

 కుటుంబ సభ్యులు వినియోగించుకునేందుకు అనువుగా వేర్వేరు పోస్ట్‌పెయిడ్‌ పథకాలను భారతీ ఎయిర్‌టెల్‌ ఆవిష్కరించింది. నెలకు రూ.599-1499 అద్దెపై (జీఎస్‌టీ అదనం) లభించే ఈ పథకాల్లో అపరిమిత కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు 105-320 జీబీ డేటా లభించనుంది. కుటుంబంలోని 2-5 మంది సభ్యులు వినియోగించుకోవచ్చు. వినియోగించని డేటాను మరుసటి నెలకు బదిలీ చేసుకునే వీలు, డేటాను కుటుంబసభ్యుల మధ్య పంచుకునే అవకాశాన్ని ఈ పథకాలు కల్పిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని అడిగా: రమ్యకృష్ణ

ప్రముఖ నటి రమ్యకృష్ణ (Ramya Krishnan) త్వరలోనే ‘రంగమార్తాండ’ (Rangamarthanda)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడారు. ‘రంగమార్తాండ’ ప్రారంభానికి ముందు ‘ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు?’ అని తన భర్త, దర్శకుడు కృష్ణవంశీని అడిగానని తెలిపారు. ‘‘నేను మాతృక చిత్రం ‘నట్‌సామ్రాట్‌’ (మరాఠీ)ని చూశా. ఇలాంటి సీరియస్‌ సినిమాని ఎవరుచూస్తారని అడిగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నన్ను కోర్టులోనే చంపేస్తారేమో: ఇమ్రాన్‌ ఖాన్‌

తనను హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan).. మరోసారి అదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కోర్టులోనే తనను చంపేసే అవకాశముందని, అందువల్ల విచారణకు వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతివ్వాలని కోరారు. ఈ మేరకు పాక్‌ (Pakistan) ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అట్టా బాందియల్‌కు ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్లీజ్‌ మోదీజీ.. బడ్జెట్ ఆపొద్దు: ప్రధానికి కేజ్రీవాల్ లేఖ

దిల్లీ(Delhi)లోని ఆప్‌ ప్రభుత్వం, కేంద్రం మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈసారి దిల్లీ బడ్జెట్ రెండు వర్గాల మధ్య తాజా ప్రతిష్టంభనకు కారణమైంది. దీనిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రధాని నరేంద్రమోదీ(Modi)కి లేఖ రాశారు. బడ్జెట్‌ను ఆపొద్దని అందులో కోరారు. ‘75ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇలా ఒక రాష్ట్రస్థాయి బడ్జెట్‌ను ఆపడం ఇదే మొదటిసారి. మీరెందుకు దిల్లీ ప్రజల పట్ల ఆగ్రహంతో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమృత్‌పాల్‌ రెండో కారు, దుస్తులు సీజ్‌.. పంజాబ్‌ దాటేసి ఉంటాడా?

పరారీలో ఉన్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అతడిని పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు (Punjab Police) వరుసగా నాలుగో రోజు ముమ్మరంగా వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిందుకు అమృత్‌పాల్‌ ఉపయోగించిన రెండో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడి దుస్తులు లభించినట్లు తెలిపారు. దీంతో అతడు పంజాబ్ (Punjab) సరిహద్దులు దాటి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బ్యాటర్లు భయపడేలా.. ఇంకా వేగం పెంచు : ఉమ్రాన్‌కు ఇషాంత్ సలహా

 భారత్‌లో భీకరమైన ఫాస్ట్‌ బౌలింగ్‌ చేసే బౌలర్లు అరుదుగా ఉంటారు. ఇటీవల టీమ్‌ఇండియాకి దొరికిన పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ (Umran Malik). నిలకడగా 145-150 కి.మీ వేగంతో బంతులను సంధిస్తాడు. అయితే అతడికి ఇటీవల పెద్దగా అవకాశాలు రావడం లేదు. వేగంగా బంతులేస్తున్నప్పటికీ.. పరుగులను నియంత్రించడంలో మాత్రం విఫలం కావడంతో తుది జట్టులోకి రాలేకపోతున్నాడు. అయితే, పరుగులు ఇస్తున్నా స్పీడ్‌ను మాత్రం తగ్గించొద్దని ఉమ్రాన్‌కు మాజీ పేసర్లు షోయబ్‌ అక్తర్, డేల్‌ స్టెయిన్‌ సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కొవిడ్‌ మూలాలు బహిర్గతం చేసే బిల్లుపై బైడెన్‌ సంతకం

కొవిడ్‌(Covid 19) మూలాలకు సంబంధించి వుహాన్‌ ల్యాబ్‌పై సేకరించిన ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని బహిర్గతం చేసే బైపార్టేషన్‌ (ఇరు పార్టీలు అంగీకరించిన) బిల్లుపై నేడు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సంతకం చేశారు. దీంతో కొవిడ్‌ మూలాలకు సంబంధించి అమెరికా ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ వర్గాలు సేకరించిన రహస్య సమాచారం బయటపెట్టేందుకు అవకాశం లభించింది. ఇప్పటికే ఈ బిల్లును అమెరికా కాంగ్రెస్‌లోని సెనెట్‌, రిపబ్లికన్లు ఆమోదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మా ఇంటికి హీరో తాగొచ్చి.. రాద్ధాంతం చేశాడు: సీనియర్‌ నటి

1965లో వచ్చిన ‘వెన్నిరాడై’ (తమిళ్‌)తో తెరంగేట్రం చేసి.. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు నటి నిర్మల (Vennira Aadai Nirmala). తమిళ్‌, తెలుగు, మలయాళం, కన్నడ కలిపి 400కిపైగా చిత్రాల్లో నటించిన ఆమె ఇటీవలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అలనాటి అగ్ర హీరోలు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ తదితరులతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్న ఆమె.. ఓ కథానాయకుడు చేసిన గొడవనూ గుర్తుచేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విద్యుత్‌ Vs ఇంధన వాహనాలు.. బీమా ప్రీమియం ఎలా ఉంటుంది?

విద్యుత్తు వాహనాల (Electric vehicles- EV)కు గిరాకీ క్రమంగా పుంజుకుంటోంది. దిల్లీలో వీటి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేవలం మెట్రో నగరాల్లోనే కాదు.. చిన్న చిన్న పట్టణాల్లో వీటికి ఆదరణ పెరుగుతోంది. చట్టప్రకారం  ఏ వాహనానికైనా బీమా తీసుకోవాల్సిందే! మరి ఇంధన ఆధారిత వాహనాలతో పోలిస్తే ఈవీలపై ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఎలా ఉంటుంది? చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు