Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 01 Dec 2022 17:16 IST

1. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో భారీగా పోస్టుల భర్తీ.. ఆర్థిక శాఖ అనుమతి

వచ్చే ఏడాది తెలంగాణలో ఏర్పాటు చేయనున్న తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేసింది. ఒక్కో కళాశాలకు 433 చొప్పున మొత్తంగా 3,897 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్‌లోని వైద్య కళాశాలు, వాటి అనుబంధ ఆస్పత్రులకు పోస్టులు మంజూరయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పేరుకే వైకాపాలో బీసీలకు పదవులు.. పెత్తనమంతా అగ్రకులాలదే: చంద్రబాబు

రాష్ట్రంలో ‘బీసీలకు ఇదేం ఖర్మ’ అని బీసీ సంఘాలు ఇంటింటా చైతన్యం తీసుకురావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. బీసీల పొట్టగొట్టి, జగన్‌ రెడ్డి తన పొట్ట పెంచుకున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బీసీ సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్‌ పేరుకే వైకాపాలో బీసీలకు కొన్ని పదవులు ఇచ్చి పెత్తనమంతా అగ్ర కులాలకు అప్పగించారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం భారీ జరిమానాలు

ఒకసారి వాడి పారేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై భారీగా జరిమానాలు విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో సవరణలు తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యాన్ని సృష్టించేవారే వ్యయాన్ని భరించాలన్న సూత్రం ఆధారంగా జరిమానాలు విధించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు వేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నన్ను తిట్టడానికి కాంగ్రెస్‌లో పోటీ ఉంది.. ‘రావణ్‌’ వ్యాఖ్యలపై మోదీ సెటైర్‌

తనను ‘రావణుడి’తో పోలుస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గట్టిగా తిప్పికొట్టారు. తనను దూషించడానికి కాంగ్రెస్‌ పార్టీలో పోటీ నెలకొందని అన్నారు. మోదీని అవమానించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తన హక్కుగా భావిస్తోందని ప్రధాని దుయ్యబట్టారు. ఖర్గే అంటే తనకు గౌరవం ఉందని.. అయితే ఆయన కాంగ్రెస్‌ హైకమాండ్‌(గాంధీ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ) ఆదేశాలను పాటించక తప్పదంటూ ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘జోడో యాత్రతో చచ్చిపోతున్నాం!’.. కమల్‌నాథ్‌ వీడియో వైరల్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సహా పలువురు రాష్ట్ర నేతలు ఈ యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘జోడో యాత్ర’ కఠిన షెడ్యూల్‌పై కమల్‌నాథ్ అసహనం ప్రదర్శిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘గత వారం రోజులుగా మేం చచ్చిపోతున్నాం’’ అని ఆయన అన్నట్లుగా వీడియో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇంటి గుట్టు బయటపెట్టిన రవీంద్ర జడేజా భార్య

ఒకే కుటుంబంలో విభిన్న సిద్ధాంతాలను పాటించేవారు ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదని జామ్‌నగర్‌ భాజపా అభ్యర్థి, క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా అన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భర్త కుటుంబ సభ్యులు తన ప్రత్యర్థికి అనుకూలంగా ప్రచారం నిర్వహించడంపై ఆమె స్పందించారు. వాళ్లంతా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచినంత మాత్రాన నష్టమేమీ లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సంజూకి బదులు పంత్‌కు అవకాశాలు.. కారణమిదేనా..? వారిద్దరి గణాంకాలు ఇలా..?

అంతర్జాతీయ క్రికెట్‌లోకి ముందే అడుగు పెట్టినా.. అవకాశాలను దక్కించుకోవడంలో మాత్రం రిషభ్‌ పంత్ కంటే సంజూ శాంసన్‌ వెనుకడుగే. ఫామ్‌ లేక ఇలా జరిగిందా అంటే.. కాదనే సమాధానం వస్తుంది. పంత్‌ కంటే సంజూదే బ్యాటింగ్ యావరేజ్‌ ఎక్కువ. మరీ ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ (వన్డేలు, టీ20లు) గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సంజూ శాంసన్‌ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనేలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తగ్గిన విమాన ఇంధనం ధర.. పెట్రోల్‌, డీజిల్‌ నో ఛేంజ్‌!

విమాన ఇంధన ధరల్ని దేశీయ చమురు మార్కెటింగ్‌ సంస్థలు 2.3 శాతం తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణం. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌తో పాటు వంట గ్యాస్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. తాజా సవరణతో విమాన ఇంధనం (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యుయల్‌- ATF) ధర కిలోలీటర్‌పై రూ.2,775 తగ్గి రూ.1,17,587.64కు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జల శక్తి మంత్రిత్వశాఖ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌..!

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ట్విటర్‌ ఖాతా హ్యకింగ్‌కు గురైంది. దిల్లీ ఎయిమ్స్‌ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయి పదిరోజులు గడవక ముందే మరో ప్రభుత్వ ఖాతా హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్లడం ఆందోళనకరంగా మారింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు భావిస్తున్నారు. ఈ పేజీలో అనుమానాస్పద ట్వీట్లు కనిపించాయి. ఈ ట్విటర్‌ ఖాతాలో క్రిప్టో రంగంలోని సుయ్‌ వాలేట్‌ అనే సంస్థకు సంబంధించిన పోస్టులు కనిపించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బంగ్లాదేశ్‌ పర్యటనకు భారత్‌.. షెడ్యూల్‌ ఇదే.. లైవ్‌స్ట్రీమింగ్‌ ఎలాగంటే..?

టీ20 ప్రపంచకప్‌ తర్వాత వరుసగా మ్యాచ్‌లతో టీమ్‌ఇండియా బిజీబిజీగా గడిపేస్తోంది. కివీస్‌ పర్యటన ముగియడంతో మరో సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. బంగ్లాతో మూడు వన్డేలు, రెండు టెస్టులను భారత్‌ ఆడనుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్‌ఇండియా బరిలోకి దిగబోతోంది. భారత ఆటగాళ్లు ఇవాళ ఢాకాకు చేరుకొంటారు. బంగ్లాదేశ్‌ వన్డే కెప్టెన్‌గా తమీమ్‌ ఇక్బాల్ ఉంటాడు. అయితే టెస్టు జట్టును ఇంకా ప్రకటించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని