Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల  కోసం క్లిక్‌ చేయండి.

Updated : 24 Sep 2022 17:46 IST

1. బ్రహ్మోత్సవాల సమయంలో బ్రేక్‌ దర్శనాల్లో మార్పులు: తితిదే ఛైర్మన్‌

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో బ్రేక్‌ దర్శనాల్లో మార్పులు చేశామని.. ప్రయోగాత్మకంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బ్రేక్‌ దర్శనాలు ఉంటాయని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. పోలీసుల ఆంక్షల మధ్యే పాదయాత్ర.. గుడివాడలో భారీ బందోబస్తు

పోలీసుల ఆంక్షల మధ్యే అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండడంతో ఇతర ప్రాంతాల నేతలను రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రానికి రైతుల పాదయాత్ర గుడివాడ చేరుకోబోతోంది. ఈ నేపథ్యంలో గుడివాడ పట్టణంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా దాదాపు 300మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. హస్తం పార్టీ అధ్యక్ష పదవికి శశిథరూర్‌ పోటీ ఖరారు

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పార్టీ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ పోటీ ఖరారైంది. ఈ మేరకు శనివారం ఆయన నామినేషన్‌ పత్రాలు తీసుకున్నారు. దీంతో ఈ పదవి రేసులో అధికారికంగా బరిలో దిగిన మొదటి అభ్యర్థిగా నిలిచారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటూ తన ఉద్దేశాన్ని వ్యక్తపరచిన తొలి నేత కూడా శశిథరూరే. ఈ మేరకు ఇటీవల పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసి.. ఇదే విషయాన్ని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. టీ20ల్లో రోహిత్ అరుదైన ఘనత.. గప్తిల్‌ను అధిగమించిన హిట్‌మ్యాన్‌

కీలకమైన పోరులో రోహిత్ శర్మ (46 నాటౌట్‌: 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీరవిహారంతో టీమ్‌ఇండియా విజయం సాధించింది. దీంతో ఆసీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసి రేసులో నిలబడింది. ఆఖరి మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా ఆదివారం జరగనుంది. వర్షం కారణంగా నాగ్‌పుర్‌లోని మైదానం చిత్తడిగా మారడంతో పూర్తిస్థాయి మ్యాచ్‌ జరగలేదు. మ్యాచ్‌ను ఎనిమిది ఓవర్లకు కుదించగా..  ఆసీస్‌ 90/5 స్కోరు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. మీ బంగారంపై ఉన్న హాల్‌మార్కింగ్‌ అసలైనదేనా?

బంగారం కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది దాని స్వచ్ఛత గురించి ఆందోళన చెందుతుంటారు. అందుకే వినియోగదారులకు స్వచ్ఛత గురించి తెలియజేసేందుకు హాల్‌ మార్క్‌ ఉన్న ఆభరణాలనే విక్రయించాలని ప్రభుత్వం నిబంధనలను తీసుకొచ్చింది. హాల్‌మార్కింగ్ అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) నాణ్యత ప్రమాణపత్రం. ఇది బంగారం స్వచ్ఛతకు హామీ ఇస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. లష్కరే, ఐసిస్‌లో చేరేందుకు పీఎఫ్‌ఐ ప్రేరేపిస్తోంది.. ఎన్‌ఐఏ నివేదిక

ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనేక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఈ పత్రాల్లో అత్యంత కీలక సమాచారం లభించినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. లష్కరే తోయిబా, ఐసిస్‌, అల్‌ఖైదా వంటి ఉగ్రముఠాల్లో చేరేలా ఈ సంస్థ యువతను ప్రేరేపిస్తోందని వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ నివేదకలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. చిన్నారులపై లైంగిక హింస.. కేంద్రం కొరడా..!

ఆన్‌లైన్‌ చైల్డ్ పోర్నోగ్రఫీపై కేంద్రం కొరడా ఝులిపించింది. ఈ క్రమంలో చిన్నారుల అశ్లీల సమాచార కట్టడికి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దేశవ్యాప్త దాడులకు దిగింది. ఆపరేషన్ ‘మేఘచక్ర’ పేరిట.. 19 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో 56 చోట్ల తనిఖీలు చేపట్టింది. పిల్లలపై లైంగిక హింసకు సంబంధించిన సమాచార వ్యాప్తికి పాల్పడే ముఠాలను.. మైనర్లను బ్లాక్‌ మెయిల్ చేసే వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునే నిమిత్తం ఈ దాడులు చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియల కంటే.. షింజో అబె వీడ్కోలుకు అధిక ఖర్చు!

జపాన్ మాజీ ప్రధాని షింజో అబె తుది వీడ్కోలు కార్యక్రమం ఈనెల 27 తేదీన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని హంగులతో జరిపేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఇందుకు సంబంధించిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సంస్మరణ సభకు అనేక ఏర్పాట్లు చేస్తూ, భారీగా ఖర్చు చేస్తోందని.. వీడ్కోలు కార్యక్రమం కోసం ఏకంగా 1.66 బిలియన్ల యెన్‌లను ఖర్చు చేస్తున్నారని అక్కడి మీడియా పేర్కొంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్‌ అన్నది పేరు కాదు : బాలకృష్ణ

విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయానికి డా.వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చుతూ ఏపీ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ.. ‘‘మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్‌ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక ఎన్టీఆర్‌’’ అని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. నయన్‌-విఘ్నేశ్‌ లవ్‌, వెడ్డింగ్‌ డాక్యుమెంటరీ.. టీజర్‌ చూశారా?

అగ్రకథానాయిక నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) ప్రేమ, పెళ్లి డాక్యుమెంటరీగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనిని ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిర్‌టేల్‌’ పేరుతో తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. ఈ డాక్యుమెంటరీలో నయన్‌-విఘ్నేష్‌లు కలిసి ఉన్న మధుర ఘట్టాలతో పాటు, పలు ప్రశ్నలకు ఇరువురు సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు