పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు రద్దు

దేశ చరిత్రలోనే తొలిసారిగా లోక్‌సభ, రాజ్యసభలు వేర్వేరు సమయాల్లో సమావేశం కానున్నాయి.

Updated : 02 Sep 2020 13:06 IST

దిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు సమావేశాల నిర్వహణకు సంబంధించిన వివరాలను ఉభయ సభల సెక్రటరీ జనరల్స్‌ బులెటిన్‌ ద్వారా విడుదల చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సభల నిర్వహణలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ, రాజ్యసభలు వేర్వేరు సెషన్లలో సమావేశం కానున్నాయి.

మారిన సమావేశ సమయాలు

ఈ సారి సమావేశాల్లో ఉదయం రాజ్యసభ, మధ్యాహ్నం లోకసభ కార్యకలాపాలు కొనసాగుతాయి. అయితే.. తొలిరోజు మాత్రం లోకసభ సమావేశాలు ఉదయం 9గం.ల నుంచి మధ్యాహ్నం 1గం. వరకు ఆ తర్వాత అక్టోబర్‌ 1 వరకు మధ్యాహ్నం 3 నుంచి 7 వరకు జరుగనున్నాయి. కాగా, మొదటి రోజు రాజ్యసభ సమావేశాలు మధ్యాహ్నం 3 నుంచి 7 వరకు జరుగగా... ఆ తర్వాత అన్ని రోజులు ఉదయం 9గం.ల నుంచి మధ్యాహ్నం 1గం. వరకు కొనసాగుతాయని ప్రకటనలో వివరించారు. కాగా, ఈ మొత్తం సమావేశాల్లో ఇరుసభల్లో ప్నశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసినట్టు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

కరోనా ప్రత్యేక ఏర్పాట్లు

ఈసారి పార్లమెంటు ఉభయ సభలు 18 రోజులు సమావేశం కానున్నాయి. కాగా, పార్లమెంటు పరిసరాలను కొవిడ్‌ సురక్షిత ప్రదేశంగా మార్చేందుకు అనుసరించాల్సిన విధానాల గురించి నియమావళిని రూపొందించారు. సమావేశాల ప్రారంభానికి కనీసం 72 గంటల ముందు సంబంధిత వ్యక్తులందరికీ కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలను తప్పనిసరి చేశారు. ఈ నిబంధన ఎంపీలు, ఉభయ సభల సిబ్బంది, విలేకరులకు వర్తిస్తుందని వివరించారు.

అంతేకాకుండా వేలాది మాస్కులు, గ్లౌజులు, వందలాది శానిటైజర్‌ సీసాలు, ఫేస్‌ షీల్డులు, టచ్‌-ఫ్రీ తలుపులు తదితర ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వివరించారు. సామాజిక దూరం నిబంధనలకు అనుగుణంగా సభ్యుల సీట్ల అమరిక ఉంటుంది. 780 మంది సభ్యులు పాల్గోనున్న ఈ పార్లమెంటు సమావేశాల్లో.. ప్రతి సభ్యుడికీ డీఅర్‌డీఓ తయారుచేసిన ప్రత్యేక కరోనా కిట్లను అందజేస్తారు. సభలకు సంబంధించిన వివిధ పత్రాలు, కాగితాలు, ఫైళ్లనే కాకుండా సభ్యుల కార్లు, పాదరక్షలను కూడా శానిటైజ్‌ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని