Chennai Super Kings: అన్నాడీఎంకేకు 80% విరాళాలు.. సీఎస్‌కే యాజమాన్యం నుంచే

Chennai Super Kings: ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు యాజమాన్యం ఎన్నికల బాండ్ల రూపంలో అన్నాడీఎంకేకు భారీగా విరాళం ఇచ్చినట్లు తెలిసింది.

Published : 18 Mar 2024 18:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల బాండ్ల (Electoral Bonds) రూపంలో పార్టీలకు అందిన విరాళాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (EC) బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. వీటితో ఏ పార్టీకి ఎంత మొత్తం దక్కిందనే సమాచారం బయటికొచ్చింది. అంతేగాక, కొన్ని పార్టీలు ఈ బాండ్లతో తమకు ఎవరు విరాళం ఇచ్చారనే విషయాన్ని కూడా ఈసీతో పంచుకున్నాయి. అలా తమిళనాడుకు చెందిన ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) చెప్పిన దాతల పేర్లలో ఒకటి అందర్నీ ఆకర్షించింది. అదే చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK). ఆ పార్టీకి దక్కిన ఎన్నికల బాండ్లలో ఈ ఫ్రాంచైజీ యాజమాన్యానిదే మెజార్టీ వాటా.

ఈసీ గణాంకాల ప్రకారం.. ఎన్నికల బాండ్ల ద్వారా అన్నాడీఎంకే పార్టీకి రూ.6.05కోట్ల విరాళాలు అందాయి. ఇందులో దాదాపు రూ.5కోట్లు సీఎస్‌కే యాజమాని చెన్నై సూపర్‌కింగ్స్‌ క్రికెట్‌ లిమిటెడ్‌ ఇచ్చినవే. 2019 ఏప్రిల్‌ 2 నుంచి 4 తేదీల్లో ఈ మొత్తాన్ని పార్టీ అందుకుంది. దీంతోపాటు కోయంబత్తూరుకు చెందిన ఓ కంపెనీ రూ.కోటి, గోపాల్‌ శ్రీనివాసన్‌ అనే వ్యక్తి రూ.5 లక్షలు అన్నాడీఎంకేకు బాండ్ల రూపంలో విరాళమిచ్చినట్లు డేటాలో ఉంది.

2019 తర్వాత ఈ పార్టీకి ఎన్నికల బాండ్ల నుంచి ఎలాంటి నిధులు రాలేదు. కాగా.. సీఎస్‌కే యాజమాన్యం విరాళం విషయాన్ని గతంలో పార్టీ కోఆర్డినేటర్‌ ఒ.పన్నీర్‌ సెల్వం(ఇప్పుడు బహిష్కృత నేత) రెండుసార్లు ఈసీకి వెల్లడించారు. ఆ తర్వాత 2023లో అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ కూడా ఇదే సమాచారాన్ని పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని