Anand Mahindra: చంద్రయాన్‌-3పై అనుచిత వ్యాఖ్యలు.. టీవీ యాంకర్‌కు ఆనంద్‌ మహీంద్రా స్ట్రాంగ్‌ రిప్లై

ఇస్రో (ISRO) చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగంపై ఓ అంతర్జాతీయ మీడియా ఛానెల్‌ చేపట్టిన చర్చా కార్యక్రమంలో భారత్‌ గురించి యాంకర్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ధీటుగా బదులిచ్చారు.

Updated : 24 Aug 2023 13:08 IST

ముంబయి: జాబిల్లిని చేరుకున్న భారతావనిని యావత్‌ ప్రపంచం అభినందిస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ఇస్రో (ISRO) చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగంపై ఓ అంతర్జాతీయ మీడియా ఛానెల్‌ చేపట్టిన చర్చా కార్యక్రమంలో భారత్‌ గురించి యాంకర్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) దీటుగా బదులిచ్చారు. వలస పాలన ఫలితంగానే భారత్‌ పేదరికంలో ఉందన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

చంద్రయాన్‌-3 విజయం తర్వాత ఓ అంతర్జాతీయ మీడియా ఛానెల్‌లో యాంకర్‌ ‘‘చాలా మంది దీని గురించి ఆలోచిస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నా.. భారత్‌లో ఎంతో మంది ఇంకా పేదరికంలో ఉన్నారు. అలాగే, మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఆ దేశం ఇంకా వెనుకంజలోనే ఉంది. సుమారు 70కోట్ల మంది భారతీయులకు మరుగుదొడ్లు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసి భారత్‌ అంతరిక్ష పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందా?’’ అని చర్చలో పాల్గొన్న వ్యక్తిని ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. 

చంద్రుడిపై నడయాడిన భారత్‌: ఇస్రో ట్వీట్‌

‘‘మీరు చెబుతున్న పేదరికం.. వలస పాలనలో వందల ఏళ్లు భారత వనరులను ప్రణాళికా బద్ధంగా దోచుకున్న దానికి ఫలితం. మా నుంచి విలువైన కోహినూర్‌ డైమండ్‌తోపాటు మా శక్తి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని కూడా దోచుకున్నారు. వలసపాలన ముఖ్య ఉద్దేశం సంపదను దోచుకోవడం మాత్రమే కాదు.. దేశ ప్రజలను ఆత్మన్యూనతకు గురిచేసి బాధితులుగా మార్చడం. ఇప్పుడు మీరు టాయిలెట్లు, అంతరిక్ష పరిశోధనలపై పెట్టుబడులను ప్రశ్నించడం ఈ వైఖరికి భిన్నమైందేమీ కాదు. మేం చంద్రుడిపైకి చేరుకోవడం మా దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుకోవడంతోపాటు మా ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది. విజ్ఞాన రంగంలో పురోగతిని సాధించేందుకు మాకు నమ్మకాన్ని కలిగిస్తుంది. అంతేకాదు పేదరికం నుంచి బయటపడాలనే ఆకాంక్షను ప్రేరేపిస్తుంది. అసలు పేదరికం ఏంటంటే ఆకాంక్షల్లో కూడా పేదరికాన్ని కలిగి ఉండటమే’’ అని మహీంద్రా బదులిచ్చారు. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చూసిన నెటిజన్లు ‘సరైన సమాధానం చెప్పారు’ అని కామెంట్లు చేస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని