Driverless Metro Rail: ‘డ్రైవర్‌ రహిత’ మెట్రో రైలు వచ్చేసింది.. త్వరలో ట్రయల్‌ రన్‌?

డ్రైవర్‌ రహిత మెట్రో రైలు చైనా నుంచి బెంగళూరుకు చేరుకుంది. త్వరలోనే బోగీలను అమర్చి రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 15 Feb 2024 01:38 IST

బెంగళూరు: బెంగళూరు (Bengaluru) మెట్రో రైలు చరిత్రలో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమవుతోంది. తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలు (Driverless Metro Train) సేవలను మరికొన్ని నెలల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఆరు కోచ్‌లు కలిగిన తొలి రైలు చైనా నుంచి బెంగళూరుకు చేరుకున్నట్లు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (BMRCL) వెల్లడించింది. ఈ కోచ్‌లను ఎలక్ట్రానిక్‌ సిటీలోని హెబ్బగోడి డిపోకు తరలించినట్లు తెలిపింది. ఎల్లో లైన్‌లో ఆర్‌వీ రోడ్డు నుంచి సిల్క్‌ బోర్డు మీదుగా ఎలక్ట్రానిక్‌ సిటీ వరకు ఈ రైలు నడపనున్నారు. ‘‘డ్రైవర్‌ రహిత మెట్రో రైలు, కోచ్‌లను చైనాకు చెందిన సంస్థ సమకూర్చింది. 216 కోచ్‌ల తయారీకి ఆ సంస్థతో బీఎంఆర్‌సీఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో 90 కోచ్‌లతో 15 రైళ్లు ఏర్పాటు చేసి ఎల్లో లైన్‌లో నడిపిస్తాం. ప్రస్తుతం వచ్చింది నమూనా రైలు’’ అని బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు తెలిపారు.

చైనాకు చెందిన  సీఆర్‌ఆర్‌సీ నాన్జింగ్ పుజెన్ కో లిమిటెడ్‌ అనే సంస్థ 216 కోచ్‌లను సరఫరా చేసేందుకు రూ.1,578 కోట్ల కాంట్రాక్టును 2019లో దక్కించుకుంది. ఇందులో భాగంగా  నమూనా రైలు కోచ్‌లను జనవరి 24న చైనా నుంచి పంపగా ఫిబ్రవరి 6న చెన్నై నౌకాశ్రయానికి చేరుకున్నాయి. వివిధ రకాల టెస్ట్‌లు నిర్వహించి వాటి ఫలితాలను రైల్వే శాఖకు సమర్పించి సాంకేతిక అనుమతి కోరనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యే సరికి దాదాపు ఐదు నుంచి ఆరు నెలలు పట్టే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్లో లైన్‌పై ఇప్పటికే సివిల్‌, ట్రాక్‌ పనులు పూర్తయినప్పటికీ కోచ్‌లు అందుబాటులో లేనందున ట్రయల్‌ రన్‌ ప్రారంభం కాలేదు. ఆరు కోచ్‌లతో కూడిన నమూనా రైలును అమర్చిన తర్వాత 19.15 కి.మీల ఎల్లో లైన్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని