అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌!

గోవాలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించిన ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌ తేలడం పరిస్థితికి అద్దం పడుతోంది.

Published : 06 May 2021 01:22 IST

దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివిటీ రేటు

పనాజీ: దేశంలోనే కాదు విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే గోవా.. తాజాగా కరోనా విజృంభణతో వణికిపోతోంది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించిన ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌ తేలడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొవిడ్‌ కట్టడి ఆంక్షలు అమలు చేస్తోంది.

గోవాలో ఏప్రిల్‌ నెలలో కరోనా తీవ్రత మరింత ఎక్కువైంది. గత నెలలో అక్కడ పాజిటివిటీ 40 నుంచి 51శాతంగా ఉన్నట్లు అక్కడి కొవిడ్‌ నిర్వహణ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం గోవాలో కరోనా పాజిటివిటీ రేటు 48శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే గోవా అగ్రస్థానంలో ఉండగా.. 37శాతం పాజిటివిటీ రేటుతో హరియాణా రెండోస్థానంలో ఉంది. గోవాలో కొవిడ్‌ పరీక్షలు జరిపిన ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం చూస్తుంటే వైరస్‌ ఎంత విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతుందో స్పష్టంగా అర్థమవుతోందని ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే పూర్తి లాక్‌డౌన్‌తో పాటు కొంతకాలం పర్యాటకులు రాకుండా నిషేధం విధించడమే ఏకైక మార్గమని అభిప్రాయపడుతున్నారు.

లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గం..

ప్రస్తుతం రాష్ట్రంలో భయంకర పరిస్థితులే ఉన్నప్పటికీ ఒక వినాశనం నుంచి తప్పించుకుందని గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్‌ రాణే వెల్లడించారు. గోవాలో కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్నమాట వాస్తవమేనని.. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన మెడికల్‌ ఆక్సిజన్‌, వైద్య పరికరాలను అందించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని తెలిపారు. ఈ మహమ్మారిని నియంత్రించడానికి కఠిన లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. పర్యాటకంపై ఆధారపడిన రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారానే ఈ సంక్షోభాన్ని తట్టుకోగలదని స్పష్టంచేశారు. అయితే, రెవెన్యూను దృష్టిలో ఉంచుకొని వేల మంది పర్యాటకులను అనుమతించడం వల్లే రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయని విపక్ష పార్టీలతో పాటు వైద్యరంగ నిపుణులు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే, వైరస్‌ తీవ్రతను అదుపులోకి తెచ్చేందుకు ఏప్రిల్ 29నుంచి ఐదు రోజులపాటు గోవాలో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేశారు. ఇప్పటివరకు ఇక్కడ మొత్తం లక్ష కేసులు నమోదుకాగా ప్రస్తుతం 26వేల క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 1372 మంది ప్రాణాలు కోల్పోగా.. నిన్న ఒక్కరోజే 52మంది చనిపోవడం గోవాలో మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని