Himanta Biswa Sarma: ఆమిర్‌ ఖాన్‌.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తమ రాష్ట్ర సందర్శనను వాయిదా వేసుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు.

Published : 13 Aug 2022 01:27 IST

గువాహటి: బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తమ రాష్ట్ర సందర్శనను వాయిదా వేసుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు. ప్రస్తుతం తాము హర్‌ ఘర్ తిరంగా వేడుకల్లో నిమగ్నమై ఉన్నామని.. ఈ నెల 15 తర్వాతనే ఇక్కడకు వచ్చేలా చూసుకోవాలని సూచించారు. గువాహటిలో మీడియాతో మాట్లాడుతూ.. హిమంత ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘ఆమిర్‌ ఖాన్ ఈ రాష్ట్రాన్ని సందర్శించాలనుకుంటున్నారు. దాని గురించి నాతో మాట్లాడారు. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేం హర్‌ ఘర్ తిరంగా ఉత్సవాన్ని జరుపుకొంటున్నాం. ప్రస్తుత సమయంలో ఈ అంశం పక్కకు వెళ్లకూడదని భావిస్తున్నాం. అందుకే ఆయన పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం. 15 తర్వాతనే ఆయన రాష్ట్రంలో పర్యటించాలనుకుంటున్నాం’ అని వెల్లడించారు. ఆమిర్ ఖాన్ నటించిన లాల్‌ సింగ్ చడ్డా ఇటీవలే విడుదలైంది. తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆగస్టు 14న గువాహటికి వెళ్లాలనుకున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థనతో దానిని ఆగస్టు 16కు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమిర్‌ తమ రాష్ట్రానికి వచ్చినప్పుడు తనతో కలిసి సినిమా వీక్షిస్తానని హిమంత చెప్పినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల అస్సాంకు ఈ బాలీవుడ్ నటుడు వరద సాయాన్ని అందించారు. దీనిపై హిమంత అభినందనలు కూడా తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని