Covid: కొవిడ్‌ కలవరం.. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో నేడు మాక్‌ డ్రిల్‌

దేశంలో కరోనా (Corona Virus) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 5,880 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు దాదాపు 7శాతానికి చేరువైంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది.

Updated : 10 Apr 2023 11:17 IST

దిల్లీ: దేశంలో కరోనా (Corona Virus) మహమ్మారి మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతుండటం కలవరపెడుతోంది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మళ్లీ నిబంధనలను అమల్లోకి తెచ్చాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కొవిడ్‌ (Covid) బాధితులకు చికిత్స అందించే ఆసుపత్రుల్లో సౌకర్యాలపై నేటి నుంచి రెండు రోజుల పాటు మాక్‌ డ్రిల్‌ (Mock Drill) ప్రారంభించింది.

కొవిడ్‌ (Covid 19) నిర్వహణ సంసిద్ధతను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సోమవారం మాక్‌ డ్రిల్‌ (Mock Drill) మొదలుపెట్టగా.. మంగళవారం కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, ఐసోలేషన్‌, ఆక్సిజన్‌ వసతి ఉన్న బెడ్‌లు, వెంటిలేటర్‌, ఐసీయూ బెడ్‌ల వివరాలను ఈ మాక్‌డ్రిల్‌లో సేకరించనున్నారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది, అంబులెన్స్‌ల వివరాలను తెలుసుకోనున్నారు. దీంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు, కిట్ల లభ్యత, పీపీఈ కిట్లు, ఆక్సీమీటర్‌లు, మాస్కులు (ఎన్‌-95), వెంటిలేటర్ల సంఖ్య వంటి కీలక అంశాలు గుర్తించి వైద్యారోగ్య శాఖకు నివేదిస్తారు. వీటన్నింటిని పరిశీలించి వైరస్‌ను ఎదుర్కొనే సంసిద్ధతపై కేంద్ర వైద్యారోగ్యశాఖ అంచనా వేస్తుంది. హరియాణాలోని ఝజ్జర్‌ ఎయిమ్స్‌లో జరిగిన మాక్‌ డ్రిల్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పరిశీలించారు.

ఇదీ చదవండి: పెరుగుతున్న కరోనా కేసులు.. పలు రాష్ట్రాల్లో అమల్లోకి నిబంధనలు!

6శాతం దాటిన పాజిటివిటీ రేటు..

మరోవైపు దేశంలో తాజాగా 5,880 కొత్త కేసులు (Daily New Cases) నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 6.91శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ కారణంగా నిన్న 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు చొప్పున మరణాలు నమోదవ్వగా.. కేరళలో ఇద్దరు, గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, జమ్మూకశ్మీర్‌లో ఒక్కొక్కరు కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అటు క్రియాశీల కేసుల సంఖ్య 35,199కి పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని