HighCourt: కుక్కకాటు.. ఒక్కో ‘పంటి గాటు’కు రూ.10వేల పరిహారం!

వీధి శునకాలు, ఇతర జంతువుల దాడి కేసులో పరిహారం చెల్లించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పంజాబ్‌-హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది.

Updated : 14 Nov 2023 17:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా శునకాల దాడులు (Dog bite) విపరీతంగా పెరుగుతుండటం, వాటి నియంత్రణపై చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శునకం దాడి సంబంధించిన కేసులో పంజాబ్‌-హరియాణా హైకోర్టు (High Court) ఆసక్తికర తీర్పు వెలువరించింది. వీధి శునకాలు, ఇతర జంతువుల దాడి కేసులో పరిహారం చెల్లించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. కుక్కకాటుకు గురైన వ్యక్తికి ఒక్కో పంటి గాటుకు కనీసం రూ.10వేలు చెల్లించాలని, తీవ్ర గాయమైతే  (0.2 సెం.మీ మేర కోతపడినట్లయితే) రూ.20వేల పరిహారం అందించాలని ఆదేశించింది.

పెంపుడు శునకం కరిస్తే.. యజమానికి రూ.10వేల జరిమానా

వీధుల్లో ఉండే మూగజీవాల దాడులకు సంబంధించి దాఖలైన 193 పిటిషన్లను పంజాబ్‌-హరియాణా హైకోర్టు విచారించింది. ‘పరిహారం చెల్లించే ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. వీటిని సంబంధిత ప్రభుత్వ విభాగం లేదా ప్రైవేటు వ్యక్తుల నుంచి రికవరీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది’ అని పంజాబ్‌-హరియాణా హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో వెలువరించింది. ఆవులు, ఎద్దులు, గాడిదలు, శునకాలు, గేదెలతోపాటు అడవి, పెంపుడు జంతువుల దాడుల్లో చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించేందుకు ఓ కమిటీని నియమించాలని పంజాబ్‌, హరియాణాతోపాటు చండీగఢ్‌ పాలనా విభాగాలకు సూచించింది. క్లెయిమ్‌ దాఖలు చేసిన నాలుగు నెలల వ్యవధిలో పరిహారాన్ని ఆమోదించాలని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని