Mukesh Ambani: ముకేశ్ అంబానీకి బెదిరింపుల కేసు.. నిందితుడి అరెస్ట్‌

Mukesh Ambani: ముకేశ్ అంబానీకి బెదిరింపుల కేసులో నిందితుడిని ముంబయి పోలీసులు తెలంగాణలో అరెస్ట్ చేశారు. ఐపీ అడ్రస్‌ ద్వారా అతడి ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Published : 04 Nov 2023 15:52 IST

Mukesh Ambani | ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani)కి ఇటీవల వరుసగా బెదిరింపు మెయిల్స్‌ (Threat Mails) వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులు (Mumbai Police) ఓ నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడిని 19 ఏళ్ల గణేశ్‌ రమేశ్‌ వనపర్దిగా గుర్తించిన పోలీసులు.. అతడిని తెలంగాణ (Telangana) నుంచి అరెస్టు చేసినట్లు తెలిపారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం నవంబరు 8వ తేదీ వరకు అతడిని పోలీసు కస్టడీకి అప్పగించింది.

ఇటీవల ముకేశ్‌ అంబానీని బెదిరిస్తూ వరుసగా మెయిల్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. తొలుత అక్టోబరు 27న ఓ మెయిల్‌ రాగా.. రూ. 20 కోట్లు ఇవ్వాలని, లేకపోతే ముకేశ్‌ అంబానీని అంతమొందిస్తామని అందులో నిందితుడు పేర్కొన్నాడు. ఆ తర్వాత వరుసగా ఈ తరహా మెయిల్స్‌ వచ్చాయి. రూ.200 కోట్లు ఇవ్వాలని, ఆ తర్వాత రూ.400 కోట్లు ఇవ్వాలని నిందితుడు డిమాండ్‌ చేయడం గమనార్హం.

ముకేశ్‌ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఐపీ అడ్రస్‌ ఆధారంగా నిందితుడు తెలంగాణలో ఉన్నట్లు గుర్తించి.. అరెస్టు చేసినట్లు వెల్లడించారు. షాదాబ్‌ ఖాన్‌ అనే పేరుతో నిందితుడు ఈ బెదిరింపు మెయిల్స్‌ పంపినట్లు తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

గతేడాది కూడా అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. 2022 ఆగస్టు 15వ తేదీన ఓ వ్యక్తి రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్‌ ఆస్పత్రికి బెదిరింపు ఫోన్‌ వచ్చింది. ఆసుపత్రిని పేల్చేస్తామని, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని నిందితుడు బెదిరించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

 2021లో అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ కేసులను తొలుత ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజే దర్యాప్తు చేపట్టగా.. తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారిగా తేలడం గమనార్హం. దీంతో ఎన్‌ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్‌ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని