Corona Virus: కొవిడ్‌ చికిత్సకు కొత్త మాత్ర : ఫైజర్‌

కొవిడ్‌ చికిత్సలో మరో ముందడుగు! కరోనా మహమ్మారి కారణంగా ఆసుపత్రులపాలై, మరణాన్ని ఎదుర్కోవాల్సిన ముప్పును సుమారు 90% మేర తగ్గించే మాత్రలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

Updated : 02 Apr 2024 15:49 IST

వాషింగ్టన్‌: కొవిడ్‌ చికిత్సలో మరో ముందడుగు! కరోనా మహమ్మారి కారణంగా ఆసుపత్రులపాలై, మరణాన్ని ఎదుర్కోవాల్సిన ముప్పును సుమారు 90% మేర తగ్గించే మాత్రలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వీటిని తాము అభివృద్ధి చేసి, ప్రయోగ పరీక్షలు పూర్తిచేసినట్టు ఫైజర్‌ సంస్థ శుక్రవారం వెల్లడించింది. కొవిడ్‌ బాధితులకు ఇప్పటివరకూ ఇతర వ్యాధుల నియంత్రణకు ఉద్దేశించిన ఔషధాలను ఇస్తున్నారు. దీంతో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ను కట్టడిచేసే ప్రధాన లక్ష్యంతో మాత్రలను తయారు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఔషధ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో అందరికంటే ముందుగా ‘మెరెక్‌’ సంస్థ గుళికలను అభివృద్ధి చేసింది. బ్రిటన్‌ వీటి ఫలితాలను సమీక్షించి, ఇప్పటికే ఆమోదం తెలిపింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సమీక్ష ఇంకా పూర్తికాలేదు. అయితే, కొవిడ్‌ను అత్యంత సమర్థంగా అడ్డుకోగల మాత్రలను తాము అభివృద్ధి చేసినట్టు ఫైజర్‌ ప్రధాన శాస్త్రవేత్త డా.మైకేల్‌ డోల్‌స్టెన్‌ వెల్లడించారు.

మరణం నుంచి పూర్తి రక్షణ!

‘‘మాత్రలు అందుబాటులోకి వస్తే కొవిడ్‌ చికిత్స సులభమవుతుంది. మొత్తం 775 మంది బాధిత వయోజనులకు ఇతర యాంటీవైరల్‌ ఔషధాలతో కలిపి వీటిని చికిత్సగా అందించాం. వీరెవరూ టీకాలు తీసుకోలేదు. పైగా మధుమేహం, హృద్రోగం, స్థూలకాయంతో బాధపడుతున్నవారే. స్వల్ప-మధ్యస్థాయి లక్షణాలు కనిపించిన మూడు రోజుల్లోనే చికిత్సను ప్రారంభించి, ఐదు రోజులపాటు కొనసాగించాం. ఆ సమయంలో వీరిలో కొద్దిపాటి దుష్ప్రభావాలు కనిపించాయి. అయితే, కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరిక, మరణం ముప్పు 89% మేర తగ్గినట్టు గుర్తించాం. 1% కంటే తక్కువమంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది. కానీ, వీరిలో ఒక్కరు కూడా మరణించలేదు. సుమారు 90% సమర్థతతో పనిచేస్తున్న ఈ మాత్రలు... మరణం నుంచి 100% రక్షణ కల్పించగలవు’’ అని డా.మైకేల్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని