
Vaccination Drive: ‘జైకోవ్- డీ ప్రస్తుతానికి పెద్దలకు మాత్రమే!’
దిల్లీ: జైడస్ క్యాడిలా రూపొందించిన జైకోవ్- డీ టీకాను దేశంలో 12 ఏళ్లు, ఆపై వారికి ఇచ్చేందుకు డీజీసీఐ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. త్వరలో కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా పౌరులకు ఈ టీకా వేయనున్నారు. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే కోటి డోసులకు ఆర్డర్ పెట్టింది. సూది అవసరం లేకుండానే పంపిణీ చేసే ఈ టీకా కోసం ప్రత్యేక పరికరాన్ని వాడనున్నారు. ఇందుకోసం వ్యాక్సినేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. అయితే.. ఈ డ్రైవ్లో భాగంగా ప్రస్తుతానికి పెద్దలకు మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇస్తామని సంబంధిత వర్గాలు ఆదివారం తెలిపాయి. పిల్లలకు కొవిడ్ టీకా విషయంలో తొందరపడకూడదని, నిపుణుల అభిప్రాయం ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇటీవలే డోసు ధర ఖరారు..
12 ఏళ్లు, ఆపైవారి కోసం భారత్లో డీజీసీఐ క్లియరెన్స్ పొందిన మొదటి కొవిడ్ టీకా ‘జైకోవ్- డీ’. ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ ఇది. మూడు డోసుల్లో తీసుకోవాల్సిన ఈ టీకాను కేంద్ర ప్రభుత్వానికి ఒక డోసుకు రూ.265కు ఇచ్చేందుకు అంగీకరించినట్లు ఆ సంస్థ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రత్యేక పరికరం ధర రూ.93(జీఎస్టీ కాకుండా) కలుపుకొని ఒక డోసు ధర రూ.358 అవుతుందని పేర్కొంది. మరోవైపు రెండు నుంచి 18 ఏళ్లలోపువారి కోసం భారత్ బయోటెక్ రూపొందించిన టీకా ప్రస్తుతం నిపుణుల పరిశీలనలో ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి!
ఇవీ చదవండి
Advertisement