సమంత నటి మాత్రమే కాదు..!

జెస్సీ’గా నటిగా వెండితెరకు పరిచయమై కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారు నటి సమంత అక్కినేని. మొదటి చిత్రంతోనే నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం ...

Updated : 28 Apr 2021 15:24 IST

బర్త్‌డే బేబీ గురించి కొన్ని విశేషాలు

‘జెస్సీ’గా వెండితెరకు పరిచయమై కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారు నటి సమంత అక్కినేని. మొదటి చిత్రంతోనే నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం ‘ఈగ’, ‘రంగస్థలం’, ‘యూటర్న్‌’, ‘ఓ బేబీ’ వంటి విభిన్న చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. అయితే సమంత కేవలం నటిగా మాత్రమే కాకుండా ప్రతి నాయకురాలిగా, వ్యాఖ్యాతగా, వ్యాపారవేత్తగా ప్రతిఒక్కరికీ మరింత చేరువయ్యారు. బుధవారం సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు...

క్లాసిక్‌ ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గౌతమ్‌ మేనన్‌. ఆయన దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావె’తో తెలుగు తెరకు పరిచయమైన చెన్నై ముద్దుగుమ్మ సమంత. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో సామ్‌ జెస్సీ పాత్రలో కనిపించారు. ఇందులో సామ్‌.. సాధారణ అమ్మాయిగా కనిపించి యువత మనస్సులో ప్రత్యేక చోటు సొంతం చేసుకున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి వెండితెరపై చేసిన మాయాజాలం ఈగ. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో సామ్‌ ఇందు పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రానికిగానూ ఆమె (తెలుగు) మొదటిసారి ఉత్తమనటిగా ఫిలింఫేర్‌ అవార్డు సొంతం చేసుకున్నారు.

తన మొదటి సినిమా హీరో నాగచైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ‘ఏమాయ చేసావె’ తర్వాత వీరిద్దరూ ‘ఆటోనగర్‌ సూర్య’, ‘మనం’ చిత్రాలకు కలిసి పనిచేశారు. అలా మొదటి సినిమాతో ఏర్పడిన వీరి పరిచయం కొన్నేళ్లకు ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో 2017 అక్టోబర్‌ 7న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వివాహమైన అనంతరం వీరిద్దరూ ‘మజిలీ’లో నటించారు. ఇందులో చైసామ్‌ భార్యాభర్తలుగా కనిపించారు.

సమంత కేవలం కథానాయికగానే కాకుండా విలన్‌ పాత్రలోనూ నటించారు. విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన ‘10’లో సామ్‌ ప్రతినాయకురాలిగా మెప్పించారు. ఇందులో ఆమె కథానాయికగా, ప్రతినాయకురాలిగా ద్విపాత్రాభినయంలో కనిపించారు.

సమంతలోని నటికి అద్దం పట్టిన చిత్రం ‘రంగస్థలం’. అప్పటివరకూ గ్లామర్‌ పాత్రల్లో నటించిన ఆమె మొట్టమొదటిసారి డీగ్లామర్‌ లుక్‌లో గ్రామీణ యువతిగా కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. దీంతో రామలక్ష్మి పాత్ర సామ్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది.

విభిన్న కథతో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంగా తెరకెక్కింది ‘యూటర్న్‌’. ఇందులో సామ్‌ రచన అనే జర్నలిస్ట్‌గా నటించారు. అయితే ఈ చిత్రం ముందు వరకూ తన పాత్రలకు స్నేహితురాలు చిన్మయితో డబ్బింగ్‌ చెప్పించుకున్న సామ్‌.. ఈ సినిమాలో మొదటిసారి తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు.

60 ఏళ్ల వృద్ధురాలు పాతికేళ్ల యువతిగా మారితే ఎలా ఉంటుందో చూపించిన భావోద్వేగభరిత చిత్రం ‘ఓ బేబీ’. నందినిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో ‘బేబీ’గా సామ్‌ మెప్పించారు.

సమంత నటిగానే కాకుండా వ్యాఖ్యాతగానూ తెలుగువారికి చేరువయ్యారు. ఆమె వ్యాఖ్యతగా వ్యవహరించిన ‘సామ్‌జామ్‌’.. ఆహా ఓటీటీలో ప్రసారమై అందర్నీ ఆకర్షించింది. అలాగే ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారమయ్యే రియాల్టీ షోకు సైతం ఆమె యాంకర్‌గా వ్యవహరించి బుల్లితెరపై తళుక్కున మెరిశారు.

తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి సామ్‌ ‘ఏకమ్‌’ స్కూల్‌ ప్రారంభించారు.

సమంతలో సేవాగుణం కూడా మెండుగా ఉంది. అందుకే ఆమె ప్రత్యూష సంస్థను స్థాపించి దానిద్వారా ఎంతోమంది పేద పిల్లలకు ఆశ్రయాన్ని అందిస్తున్నారు. తనకు సంబంధించిన ఎన్నో విశేషమైన రోజులను ఆమె ఇక్కడే పిల్లల మధ్య సెలబ్రేట్‌ చేసుకుంటారు.

ఇటీవల సామ్‌ వ్యాపారవేత్తగానూ మారారు. ‘సాకీ’ అనే ఆన్‌లైన్‌ వస్త్రాల బ్రాండ్‌ను సామ్‌ ప్రారంభించారు. దాని ద్వారా ఫ్యాషన్‌పై తనకున్న మక్కువను బయటపెట్టారు.

‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2’తో సామ్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అమెజాన్‌ ఓటీటీ వేదికగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సామ్‌ ఉగ్రవాదిగా కనిపించనున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని