Y Vijaya: ఆర్థికంగా నేనీ స్థాయిలో ఉన్నానంటే కారణం విజయశాంతినే: వై.విజయ

‘ఎఫ్‌-2’(F2), ‘ఎఫ్‌-3’(F3)లతో మరోసారి తెలుగువారిని తన నటనతో అలరించిన ఆనాటి నటి వై.విజయ(Y Vijaya). గతంలో స్టా్‌ర్‌ హీరోలందరితో కలిసి నటించిన...

Published : 26 Jun 2022 01:35 IST

హైదరాబాద్‌: ‘ఎఫ్‌-2’(F2), ‘ఎఫ్‌-3’(F3)లతో మరోసారి తెలుగువారిని తన నటనతో అలరించిన ఆనాటి నటి వై.విజయ(Y Vijaya). గతంలో స్టార్‌ హీరోలందరితో కలిసి నటించిన ఆమె చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘‘నటిగా గుర్తింపు వచ్చిన తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేశా. అప్పుడు నాకున్న సంపాదనతో చెన్నైలో స్థలం కొని ఇల్లు కట్టుకున్నాను. సావిత్రమ్మ(Savitri) జీవితం గురించి తెలుసుకున్నప్పుడు సినిమా అనేది జీవితాంతం ఉండదని అర్థమైంది. అదే సమయంలో ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కు మారుతోంది. దాంతో మా ఆయన, నేనూ.. మాకంటూ ఒక ఆదాయం ఉండాలని అనుకున్నాం. ఆ ఆలోచనతో పెట్టుబడులు పెట్టాం. దేవుడి దయ వల్ల మాకున్న దానిలో మేము ఆనందంగా జీవిస్తున్నాం. మరో విషయం ఏంటంటే.. ఆర్థికంగా నేనీ స్థాయిలో ఉన్నానంటే ఒక రకంగా నటి విజయశాంతి కూడా ఓ కారణం. మేమిద్దరం కలిసి సినిమాలు చేసే రోజుల్లో.. షూట్‌ నుంచి ఏ మాత్రం ఖాళీ దొరికినా.. కాసేపు సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్లం. అలా, ఓసారి తను పెట్టుబడుల విషయంపై మాట్లాడింది. ఆమె ఇచ్చిన ఆలోచనతో మేము తంజావూరులో ఒక కల్యాణమండపం, కాంప్లెక్స్‌ కట్టాం. ఇప్పుడు వాటి నుంచి వచ్చే ఆదాయంతో సంతోషంగా జీవిస్తున్నాం’’ అని విజయ వివరించారు.

1961 నుంచి వై.విజయ ఇండస్ట్రీలో ఉన్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆమె ఇప్పటివరకూ సుమారు వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. కృష్ణ, బాలకృష్ణ, చిరంజీవి, రజనీకాంత్‌, వెంకటేశ్‌.. ఇలా స్టార్‌హీరోలందరితోనూ పనిచేశారు. ‘మా పల్లెలో గోపాలుడు’, ‘ప్రతిఘటన’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘కలియుగ పాండవులు’, ‘ఏప్రిల్‌ 1 విడుదల’, ‘స్వాతి ముత్యం’, ‘రాంబంటు’, ‘సుస్వాగతం’, ‘రాజా’ సినిమాల్లోని ఆమె పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. ఇటీవల చెన్నై నుంచి హైదరాబాద్‌కు మారిన విజయ.. భవిష్యత్తులో మంచి సినిమాల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని