Bro: పవన్‌- సాయి ధరమ్‌తేజ్‌ల కాంబో.. త్రివిక్రమ్‌ ఐడియానే: సముద్రఖని

పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌తేజ్‌ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘బ్రో’ (Bro). ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 20 Jul 2023 12:41 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న సినిమా ‘బ్రో’ (Bro). సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan).. ఆయన మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. ఇక ఈ సినిమా విడుదల దగ్గరపడుతుండడంతో చిత్రబృందం ప్రచారం జోరు పెంచింది. ఈ సందర్భంగా సముద్రఖని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘బ్రో’ చిత్ర విశేషాలు పంచుకున్నారు.

‘బ్రో చిత్రం కోసం పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌తేజ్‌(Sai Dharam Tej)లను త్రివిక్రమే ఎంపిక చేసినట్లు సముద్రఖని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేను త్రివిక్రమ్‌ వద్ద ఉన్న సమయంలో.. ఓ పెద్దాయన నాకు ఫోన్‌ చేసి ‘వినోదాయ సిథం’ (Vinodhaya Sitham) సినిమా చూశానని భావోద్వేగంతో మాట్లాడారు. ఆయన్ని ఓదార్చడానికి నాకు చాలా సమయం పట్టింది. దీంతో ‘ఎవరు ఫోన్‌ చేశారు..’ అని తివిక్రమ్‌ అడిగారు. నా సినిమా చూసి ఓ పెద్దాయన ఫోన్‌ చేశారని చెప్పాను. ‘స్టోరీ లైన్‌ ఏంటి’ అని అడిగారు. ‘అందరూ భవిష్యత్తు కోసం పరుగులు తీస్తున్నారు. కానీ, భవిష్యత్తు అనేది లేదు. మనం ప్రస్తుతం బతుకుతున్నది మాత్రమే నిజం’ అనే అంశమని తివిక్రమ్‌తో చెప్పాను. ఆయనకు ఈ లైన్‌ బాగా నచ్చింది. వెంటనే 10నిమిషాల్లో స్క్రిప్ట్‌, స్క్రీన్‌ప్లే మొత్తం స్థానికతకు తగ్గట్లు మార్పులు చేశారు. పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌తేజ్‌లను హీరోలుగా ఎంపిక చేశారు’’ అని సముద్రఖని చెప్పారు. 

ఇలాంటి పాత్రలో మొదటిసారి నటించినందుకు ఆనందంగా ఉంది: విజయ్‌ వర్మ

కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier) కథానాయికలుగా నటించిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక పోస్టర్లు, టీజర్‌లతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు (Central Board of Film Certification) ఈ సినిమాకి క్లీన్‌ ‘యు’ (U) సర్టిఫికెట్‌ జారీ చేసింది. ప్రారంభంలో దాదాపు 15 నిమిషాలు మినహా సినిమా అంతా పవన్‌ కల్యాణ్‌ కనిపించనున్నారు. ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 25న జరగనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని