‘అరణ్య’ రక్షకుడు.. ‘ఉప్పెన’ విలన్‌ వచ్చేశారు!

‘బాహుబలి’ ప్రభావంతో రానా నటిస్తున్న సినిమాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రానా కీలక పాత్రలో నటిస్తున్న త్రిభాషాచిత్రం ‘అరణ్య’. సోమవారం ఈ చిత్రంలోని రానా ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో.. రానా ఇంతకు ముందెన్నడూ...

Published : 10 Feb 2020 19:45 IST

హైదరాబాద్‌: ‘బాహుబలి’ ప్రభావంతో రానా నటిస్తున్న సినిమాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రానా కీలక పాత్రలో నటిస్తున్న త్రిభాషాచిత్రం ‘అరణ్య’. సోమవారం ఈ చిత్రంలోని రానా ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో.. రానా ఇంతకు ముందెన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. అతని లుక్‌తో సినిమా ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరే సాథీ’, కన్నడలో ‘కాదన్‌’, తెలుగులో ‘అరణ్య’ పేర్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అడవిని నమ్ముకొని ఉన్న ఓ ఆదివాసి ఆ అడవికి ఆపద వస్తే ఏం చేశాడన్న కథతో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో జోయా హుస్సేన్‌, శ్రియ, విష్ణు విశాల్‌, సామ్రాట్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేరళలోని అడవుల్లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ప్రభు సోలోమన్‌ దర్శకులు. ఏప్రిల్‌ 2న సినిమా విడుదల కానుంది.


‘ఉప్పెన’లో విలన్‌గా విజయ్‌సేతుపతి

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమాలో ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి పవర్‌ఫుల్‌ విలన్‌గా కనిపించనున్నాడు. విజయ్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ సోమవారం విడుదల చేసింది. ఈ సినిమాకు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవ్‌ తేజ్‌ సరసన కృతిశెట్టి కనిపించనుంది. సినిమా కూడా ఏప్రిల్ 2న అభిమానుల ముందకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహకాలు చేస్తోంది.


ఫన్నీగా `ఒరేయ్ బుజ్జిగా` ఫస్ట్‌లుక్‌

కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. హెబ్బా పటేల్‌, మాళవిక నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మాత. ఈ సినిమాను వేసవి సందర్భంగా అభిమానుల ముందుకు తీసుకురానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని