నితిన్‌, వరుణ్‌ ఆరంభించేశారు

టాలీవుడ్‌ నటులు నితిన్‌, వరుణ్‌ తేజ్‌ తమ కొత్త ప్రాజెక్ట్‌ల పనులను సోమవారం నుంచి ప్రారంభించారు. ఈ మేరకు వీరిద్దరు తమ, తమ సినిమా షూటింగ్‌, పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు...

Updated : 24 Feb 2020 15:43 IST

ఒకరు అంధుడిగా.. మరొకరు బాక్సర్‌గా

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటులు నితిన్‌, వరుణ్‌ తేజ్‌ తమ కొత్త ప్రాజెక్ట్‌ల పనులను సోమవారం నుంచి ప్రారంభించారు. ఈ మేరకు వీరిద్దరు తమ, తమ సినిమా షూటింగ్‌, పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల విడుదలైన ‘భీష్మ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నితిన్‌.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నారు. ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ‘అంధాధున్‌’ సినిమాకి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. శ్రేష్ఠ మూవీస్‌ పతాకంపై రానున్న ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. జూన్‌ నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. బి.మధు సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నికిత్‌రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

గతేడాది విడుదలైన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా కిరణ్‌ కొర్రపాటి డైరెక్షన్‌లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. బాక్సింగ్‌ ప్రధానాంశంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్‌ బాక్సర్‌ పాత్రలో కనిపించనున్నారు. నేడు ఈ సినిమా షూటింగ్‌ వైజాగ్‌లో ప్రారంభమైంది. షూటింగ్‌ లోకేషన్‌కు సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన వరుణ్‌.. సినిమా ఆరంభమైందని, ప్రతిఒక్కరి ఆశీస్సులు కావాలని కోరారు. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు వెంకటేశ్‌, సిద్ధు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. తమన్‌ స్వరాలు అందించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని