‘దృశ్యం 2’ వస్తోంది!

విలక్షణ నటుడు మోహన్‌లాల్‌ కీలక పాత్రలో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో వచ్చిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఇతర భాషల్లో రీమేక్‌...

Updated : 21 May 2020 21:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విలక్షణ నటుడు మోహన్‌లాల్‌ కీలక పాత్రలో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో వచ్చిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఇతర భాషల్లో రీమేక్‌ అయి రికార్డు సృష్టించింది. థియేటర్‌లో ప్రేక్షకుడిని మునివేళ్లపై కూర్చోబెట్టిన ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందా? అని అందరూ ఆశగా ఎదురు చూశారు. ఆ ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయి. గురువారం మోహన్‌లాల్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘దృశ్యం2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.

సీక్వెల్‌నూ జీతూ జోసెఫ్‌ తెరకెక్కిస్తున్నారు. ఆశీర్వాద్‌ సినిమాస్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక బృందం ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ‘దృశ్యం’ పేరుతో తెలుగులో వెంకటేశ్‌, మీనా నటించగా, హిందీలో అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియలు నటించారు. తెలుగు, హిందీ భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో ‘పాపనాశం’ పేరుతో కమల్‌హాసన్‌, గౌతమిలు నటించారు.

మలయాళ ‘దృశ్యం’ విడుదలైన నాటితో పోలిస్తే ఇప్పుడు మోహన్‌లాల్‌ నటనా పరిధి పెరిగింది. ఇతర భాషల్లోని సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా, ఆయన నటించిన ‘మన్యం పులి’, ‘లూసిఫర్‌’ చిత్రాలు తెలుగులోనూ అలరించాయి. మరి ‘దృశ్యం2’ను కేవలం మలయాళానికే పరిమితం చేస్తారా? ఇతర భాషల్లోనూ విడుదల చేస్తారా? అన్నది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని