మన కథలకు హాలీవుడ్‌ కళ్లు

ఏ దృశ్యమైనా చూపించే విధానంలో కొత్తదనముంటే... అది ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అందుకే ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని వెండితెర మీద వెలుగులు పంచేందుకు విన్నూత రీతిలో ముందుకు వస్తున్నారు మన...

Updated : 11 Jan 2022 17:28 IST

ఏ దృశ్యమైనా చూపించే విధానంలో కొత్తదనముంటే... అది ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అందుకే ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని వెండితెర మీద వెలుగులు పంచేందుకు విన్నూత రీతిలో ముందుకు వస్తున్నారు మన దర్శక నిర్మాతలు. మారుతున్న ప్రేక్షకుడి అభిరుచికి అనుగుణంగా.. తెలుగు వెండి తెరపై హాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్స్‌తో సన్నివేశాలను అలంకరిస్తున్నారు. మన సినిమాటోగ్రాఫర్లు వీరికి ఏమాత్రం తీసిపోని విధంగా చిత్రాలు తీస్తున్నా, వీరికి డేట్లు సర్దుబాటు కావడం లేదు. దీంతో కథకు తగ్గట్లు పనిచేసే విదేశీ కెమెరామెన్లతో రంగంలోకి దిగడానికి దర్శక నిర్మాతలు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో పలు సినిమాలకు హాలీవుడ్‌ కెమెరామెన్లు పనిచేస్తున్నారు. దృశ్య కావ్యాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.

  స్పెయిన్‌ నుంచి.. విరాటపర్వం దాకా.. 

తెలుగుచిత్రసీమలో చిరకాలం గుర్తుండిపోయే నటుల్లో అలనాటి సావిత్రి ఒకరు. ఆమె జీవితం  ఆధారంగా 2018లో ‘మహానటి’  తెరకెక్కింది. సావిత్రి పాత్రలో  ఒదిగిపోయి నటించిన కీర్తి సురేష్‌కే కాదు.. ఆనాటి మధుర దృశ్యాలను కళ్లకు కట్టినట్లు ఈతరం ప్రేక్షకులకు చూపించిన కెమెరామెన్‌ డానీకీ ప్రశంసలు దక్కాయి. ఐదు భాషలు అలవోకగా మాట్లాడగలిగే డానీ సాంచెజ్‌ లోపెజ్‌ది స్పెయిన్‌. సినిమాటోగ్రఫీ విభాగంలో పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన పలు విశ్వవిద్యాలయాల్లో విజువల్‌ ఆర్ట్స్‌ గురించి చదువుకోవడమే కాదు.. పాఠాలూ నేర్పారు. 2014లో హిందీ చిత్రం ‘తమాన్‌చే’, 2018లో ‘ఇష్కిరియా’కు పనిచేశారు. ‘మహానటి’తో తెలుగుతెరకు పరిచయమై మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం నటులు రానా దగ్గుబాటి, సాయిపల్లవి కలయికలో.. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘విరాటపర్వం’కి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 1990లో తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్‌ ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, కోలో కోలో... పాటలోని విజువల్స్‌ డానీ పనితనాన్ని చెప్పకనేచెబుతున్నాయి. ముందు ఈ చిత్రానికి తెలుగు సినిమాటోగ్రాఫర్‌ జయకృష్ణా గుమ్మాడి పనిచేశారు. తర్వాత డేట్స్‌ సర్దుబాటుకాక.. డానీ..ఆయన స్థానంలో ప్రవేశించారు. ప్రస్తుతం నాగ అశ్విన్‌- ప్రభాస్‌ కలయికలో రూపొందనున్న చిత్రానికి డానీనే సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టునున్నారు.


పోలెండ్‌ మిరోస్లా... ఇక్కడ క్యూబా

2005లో ‘పిట్‌బుల్‌’ అనే టీ.వీ సిరీస్‌తో మొదలైంది మిరోస్లా క్యూబా బ్రొజేక్‌ ప్రస్థానం. అలా 2018  వరకూ వరుసగా పోలెండ్‌ దేశంలో టీ.వీ సిరీస్‌తో పాటు మ్యూజిక్‌ వీడియోస్‌కి దర్శకత్వం వహించారాయన. ఆ రెండు  విభాగాల్లోనే కాకుండా కెమెరా, నటుడు, రచయిత, ఎడిటర్‌గానూ గుర్తింపు పొందారాయన. పొలిష్‌ భాషలో విడుదలైన ‘బోటాక్స్‌’ (టీవీ సీరిస్‌), ‘ఉమెన్‌ ఆఫ్‌ మాఫియా-2’, ‘ది ప్లేగ్‌ ఆఫ్‌ బ్రెస్‌లా’ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారాయన. 2019లో నాని ‘గ్యాంగ్‌లీడర్‌’తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. మిరోస్లా అన్న పేరు కాస్త తెలుగు గడ్డకు పరిచమయ్యాక ‘క్యూబా’గా మారింది. ప్రస్తుతం ఈ క్యూబా అల్లుఅర్జున్‌- సుకుమార్‌ కలయికలో రానున్న పాన్‌ఇండియా చిత్రం ‘పుష్ప’తో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పుష్ప పరిచయ టీజర్‌లో విజువల్స్‌కు అల్లుఅర్జున్‌ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.


శాన్‌ఫ్రాన్సిస్కో ‘వైల్డ్‌డాగ్‌’

2016లో విడుదలైన అడివి శేష్‌ ‘క్షణం’తో తన కెమెరా పనితనం చూపించి మెప్పించారు శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన షానీల్‌ డియో. మిస్ట్రరీ- థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి మంచి విజువల్స్‌ అందించి అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల నుంచి ప్రశంసలందుకున్నారు. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, మ్యూజిక్‌ వీడియో ఎడిటర్, రీల్స్‌ హైలైట్‌ విభాగాల్లో పనిచేసిన షానిల్‌ డిజిటల్‌ మీడియా కోర్స్‌ చేశారు. 2018లో విడుదలైన అడవిశేష్‌ ‘గూఢచారి’కీ పనిచేశారు. ఇటీవల ఓటీటీ లో విడుదలైన అనుష్క ‘నిశ్శబ్దం’ చిత్రానికీ షానీల్‌యే కెమెరామెన్‌. నాగార్జున వైల్డ్‌డాగ్‌కి షానీల్‌ డియో పనిచేశారు. పూర్తిగా యాక్షన్‌- థ్రిల్లర్‌  నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి అహిషోర్‌ సోల్మన్‌ దర్శకుడు. ఈ చిత్రానికి షానిల్‌ కెమెరా వర్క్‌ ఓ ప్లస్‌ పాయింట్గా నిలిచింది.


మరికొందరు...

అమెరికాకు చెందిన షేల్డన్‌ చా.. గతనెల విడుదలైన మంచు విష్ణు నటించిన ‘మోసగాళ్లు’తో తెలుగు తెరకు సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమ్యారు. తెలుగులో ఆయనకిది తొలిచిత్రం. హాలీవుడ్‌లో ‘నైజిరియన్‌ ప్రిన్స్‌’, ‘నాఫీస్‌ ఫాదర్‌’, ‘సమ్మర్‌ నైట్‌’లతో ప్రశంసలందుకున్నారు.

తమిళ నటుడు ధనుష్, భారత్‌బాలా దర్శకత్వంలో నటించిన చిత్రం మార్యాన్‌. బాక్సాఫీస్‌ వద్ద సత్తాచాటిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా  పనిచేసింది బెల్జియం దేశానికి చెందిన మార్క్‌ కొనిక్స్‌. 2008లో మార్క్‌ తెరకెక్కించిన చిత్రం ‘జానీ మ్యాడ్‌ డాగ్‌’ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ అవార్డునూ కైవసం చేసుకోవడం విశేషం.

క్రమంగా మార్పువస్తోంది - ఓ ఇంటర్వ్యూలో సినిమాట్రోగాఫర్‌ సెంథిల్‌ కుమార్‌

నటులే కాదు.. సాంకేతిక     నిపుణులు సైతం చిత్రానికి జీవం పోస్తారు. కొన్నేళ్లుగా ప్రేక్షుకుడి దృష్టికోణంలో మార్పు వచ్చింది. అందుకే కథను మరింత బలంగా చూపించేందుకు హాలీవుడ్‌ మార్క్‌ని అందుకుంటుంది మన తెలుగు పరిశ్రమ. కొన్నేళ్లుగా తెలుగు చిత్రసీమ విదేశీ సినిమాటోగ్రాఫర్స్‌కు స్వాగతం పలుకుతోంది. ప్రతిభ ఉన్నవారికి ఇక్కడ చక్కటి పనితో పాటు గుర్తింపు లభిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని