MAA Election: ప్రకాశ్‌రాజ్‌ ప్రశ్నకు నరేష్‌ సెటైర్‌

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల వ్యవహారంతో జూన్‌ నెల మొత్తం వాడీవేడీగా  గడిచిపోయింది. నటీనటుల మాటల తూటాలతో ప్రతిఒక్కరి చూపు ‘మా’ పైనే ఉంది. ఈ నేపథ్యంలో గడిచిన వారం రోజుల నుంచి స్తబ్దుగా...

Updated : 08 Jul 2021 12:46 IST

మరోసారి తెరపైకి వచ్చిన ‘మా’

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల వ్యవహారంతో జూన్‌ నెల మొత్తం వాడీవేడీగా  గడిచిపోయింది. నటీనటుల మాటల తూటాలతో ప్రతిఒక్కరి చూపు ‘మా’ పైనే ఉంది. ఈ నేపథ్యంలో గడిచిన వారం రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న సిని‘మా’ వ్యవహారం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ట్విటర్‌ వేదికగా ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్‌, అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్‌రాజ్‌ మాటకు మాట సమాధానమిచ్చుకున్నారు.

ఈ ఏడాది ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్యానల్‌ని సిద్ధం చేసుకున్న ప్రకాశ్‌రాజ్‌.. ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల ‘ఎన్నికలు ఎప్పుడు? #JUST Asking’ అంటూ ఓ ట్వీట్‌ చేశారు. కాగా, ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌పై తాజాగా నరేష్‌ స్పందించారు. ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న వారికి మా సమాధానమిదే అంటూ సెటైర్‌ వేశారు. ‘ఎన్నికల విషయమై ఇప్పటికే ‘మా’ నుంచి ఎన్నో సార్లు సమాధానం ఇచ్చినప్పటికీ కొంతమంది మరలా అదే పనిగా ‘ఎన్నికలు ఎప్పుడు?’ అంటూ ప్రశ్నించడాన్ని చూస్తుంటే.. ‘నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకనా?’ అని అడిగినట్లు ఉంది’ అంటూ నరేష్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా, సెప్టెంబర్‌లో ‘మా’ ఎన్నికలు జరుగుతాయని మరోసారి స్పష్టం చేశారు. కరోనా కారణంగా ప్రస్తుతం ఫోర్స్‌లో ఉన్న జనరల్‌ బాడీ మీటింగ్‌ వాయిదా పడిందని.. పరిస్థితులు చక్కబడిన వెంటనే మీటింగ్‌ పెట్టి.. గడిచిన రెండేళ్ల కాలంలో చేసిన సేవా కార్యక్రమాలను అందరికీ తెలియచేస్తామని నరేష్‌ వెల్లడించారు.

ఈ ఏడాది ‘మా’ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా జరగనున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురు ‘మా’ సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్‌, మంచువిష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమతోపాటు సీవీఎల్‌ నరసింహారావు అధ్యక్ష పీఠం కోసం పోటీ పడనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని