చెప్పాల్సింది వీళ్లే ..

కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితులతో ఏడాది పాటు వాయిదా పడిన వినోదాల విందుని.. సినీప్రియులకు వడ్డీతో సహా కొసరి కొసరి వడ్డించబోతుంది తెలుగు చిత్రసీమ. ఇకపై ప్రతి వారాన్ని ఓ మినీ సంక్రాంతిలా మార్చేస్తూ.. వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని వినోదాల

Published : 02 Feb 2021 10:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితులతో ఏడాది పాటు వాయిదా పడిన వినోదాల విందుని.. సినీప్రియులకు వడ్డీతో సహా కొసరి కొసరి వడ్డించబోతుంది తెలుగు చిత్రసీమ. ఇకపై ప్రతి వారాన్ని ఓ మినీ సంక్రాంతిలా మార్చేస్తూ.. వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని వినోదాల జల్లుల్లో తడిపెయ్యబోతుంది. ఇందుకు తగ్గట్లుగానే చిరంజీవి.. వెంకటేష్‌.. బాలకృష్ణ.. లాంటి అగ్రతారల నుంచి, నాని.. నాగచైతన్య.. శర్వానంద్‌.. లాంటి కుర్ర హీరోల వరకు అందరూ ప్రేక్షకుల్నిఅలరించేందుకు ముహూర్తాలతో సిద్ధమైపోయారు. కానీ, ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన.. తుది దశ చిత్రీకరణలో ఉన్న కొన్ని క్రేజీ సినిమాలు మాత్రం ఇంతవరకు విడుదల తేదీలు ప్రకటించలేదు. మరి ఆ సినిమాలేంటి?  వాటి విశేషాలేంటో చూసేద్దాం పదండి..

 

‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయారు ప్రభాస్‌. అందుకే ఇప్పుడాయన నుంచి ఓ సినిమా వస్తుందంటే ఇటు దక్షిణాదిలోనూ అటు ఉత్తరాదిలోనూ భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఆయన నుంచి రాబోతున్న ‘రాధేశ్యామ్‌’ పైనా సినీప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయిక. 1970ల కాలం నాటి ఇటలీ  నేపథ్యంగా సాగే ఓ విభిన్నమైన ప్రేమకథతో రూపొందుతోంది. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించినా.. విడుదల తేదీపై ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ ఎదురు చూపులకు ఈనెల 14న సమాధానం దొరికే అవకాశముందని తెలుస్తుంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఆరోజు చిత్ర టీజర్‌తో పాటు విడుదల తేదీని ప్రకటించే అవకాశముందని సమాచారం. 

ప్రభాస్‌

‘లైగర్‌’ గర్జన ఎప్పుడో..

చిత్రసీమలో వేగానికి చిరునామాగా నిలుస్తుంటారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఆయన అగ్ర హీరోతో కలిసినా.. కుర్ర హీరోతో జతకట్టినా... సెట్స్‌పై ఉన్న చిత్రాన్ని వందరోజులు తిరగకుండానే పూర్తి చేస్తుంటారు. ఈలోపే విడుదల తేదీని ప్రకటించి సినీప్రియుల్ని సిద్ధం చేసి పెట్టుకుంటుంటారు. అయితే ఇప్పుడాయన నుంచి రాబోతున్న ‘లైగర్‌’ విడుదల విషయంలో ఇంత వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనన్య పాండే కథానాయిక. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కథాంశంతో రూపొందుతోంది. ఇప్పటికే 40శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. లాక్‌డౌన్‌ పరిస్థితులతో ఆగిన సంగతి తెలిసిందే. త్వరలోనే చిత్రీకరణ పునఃప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విడుదల కాస్త ఆలస్యం కాబోతున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి పూరి ఈ చిత్రాన్ని వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినా.. ఇప్పుడు జులైలో విడుదల చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తుంది. 

విజయ్‌ దేవరకొండ

‘వైల్డ్‌డాగ్‌’ నిశ్శబ్దం

 అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా సినిమాలు పూర్తి చేయడంలోనూ.. సినీప్రియుల ముందుకు రావడంలోనూ పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తుంటారు అగ్ర హీరో నాగార్జున. ఇప్పుడాయన ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. అహిషోర్‌ సాల్మోన్‌ దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. దాదాపు రెండు నెలల కిందటే చిత్రీకరణ పూర్తయింది. జనవరిలోనే ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు వార్తలొచ్చినా.. అది జరగలేదు. కనీసం ఇంత వరకు టీజర్‌.. ట్రైలర్‌ అప్‌డేట్ల ఊసే వినిపించలేదు. దీంతో నాగ్‌ అభిమానులతో పాటు సినీప్రియులు నాగ్‌ నుంచి శుభవార్త వినడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్నేళ్ల క్రితం భాగ్యనగరంలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకోని రూపొందించిన చిత్రమిది. నాగార్జున ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా కనిపించబోతున్నారు. ఆయనకు జోడీగా దియా మీర్జా, సయామీ ఖేర్‌ నటిస్తున్నారు. 

నాగార్జున

కనిపించని ‘బ్యాచిలర్‌’ అల్లరి

 అఖిల్‌ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం వల్ల వేసవికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే విడుదల తేదీ విషయంలో మాత్రం ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే వేసవి క్యాలెండర్‌ మొత్తం పూర్తిగా లాక్‌ అయిపోయిన నేపథ్యంలో బ్యాచిలర్‌ రాక ఎప్పుడన్నది ఆసక్తికరంగా మారింది. 

అఖిల్‌

క్రిష్‌ వచ్చేదెప్పుడో..

ఎన్టీఆర్‌ బయోపిక్‌ తర్వాత దర్శకుడు క్రిష్‌ నుంచి మరే చిత్రమూ రాలేదు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా ఓ చిత్రాన్ని పట్టాలెక్కించినా.. లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. ఈ విరామంలోనే వైష్ణవ్‌ తేజ్, రకుల్‌ ప్రీత్‌ జంటగా ఓ చిత్రాన్ని తెరకెక్కించారు క్రిష్‌. కొండపొలం అనే నవల ఆధారంగా ఆయన ఈ సినిమాని రూపొందించారు. రెండు నెలల క్రితమే చిత్రీకరణ పూర్తయింది. వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రచారం జరిగినా.. ఇంత వరకు విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు. 

వైష్ణవ్‌ తేజ్‌

ఇవీ చదవండి!

ఫన్‌ ఫ్యామిలీ సందడి.. శ్రద్ధా ఫన్నీ వీడియో

కేజీఎఫ్-2 రిలీజ్‌.. మోదీకి ఫ్యాన్‌ ట్వీట్‌!

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని